Work from Home | కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ, సాఫ్ట్వేర్, బహుళ జాతి సంస్థలకు చెందిన వేలాది మంది గత ఏడాదిన్నరగా వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్) సంస్కృతికి అలవాటు పడ్డారు. మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని పొడిగిస్తారన్న అంచనాల మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిపుణులు తమ సొంత పట్టణాలు, గ్రామాలకు వెళ్లిపోయారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయని తెలంగాణ సర్కార్ గత జూలైలో ప్రకటించింది. దీనిపై సాఫ్ట్వేర్ నిపుణుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తున్నది.
ఒకవైపు ఆఫీసులకు ఉద్యోగులు, నిపుణులంతా వెళితే కొవిడ్-19 ఇన్ఫెక్షన్ అవుతుందేమోనన్న ఆందోళన కొందరిలో కొనసాగుతున్నది. మరోవైపు, వర్క్ ఫ్రం హోం వల్ల తమపై భారం, ఒత్తిడి పడుతుందని, ఆఫీసులు ప్రారంభిస్తేనే బావుంటుందని మరికొందరు అంటున్నారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కామారెడ్డి జిల్లాలో మారుమూల పల్లె వాసి ఎస్ సౌజన్య అనే డేటా అనలిస్ట్ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రం హోం కంటే ఆఫీసుకెళ్లడమే బెస్ట్ అంటున్నారు. ప్రారంభంలో వర్క్ ఫ్రం హోం సౌలభ్యంగా కనిపించినా తర్వాతర్వాత టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పది గంటలకు పైగా పని చేయాల్సి వస్తుందని చెప్పారు. వర్క్ లోడ్, ఇంటర్నెట్ స్పీడ్, డెడ్లైన్లకు సరిపోలడం లేదన్నారు.
కరీంనగర్కు చెందిన కే ప్రభాకర్ అనే ఐటీ నిపుణుడు హైదరాబాద్లో ఓ అగ్రశ్రేణి బహుళ జాతి సంస్థలో పని చేస్తున్నారు. ఆఫీసుల్లో జనం రద్దీ పెరిగితే కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉందన్నారు. 25-30 శాతం మందిని ఆఫీసుకు ఆహ్వానించి మిగతా వారికి వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని సూచించారు. ప్రభాకర్తోపాటు ఏపీలోని అనంతపూర్ వాసి కోటి ఆర్ అనే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఇంకా కరోనా తగ్గుముఖం పట్టిన సంకేతాలు కనిపించడం లేదని గుర్తు చేశారు. పనితీరుపై ప్రభావం పడకుండా వర్క్ ఫ్రం హోంలో వర్క్ను, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్కు తమ కుటుంబాలను తరలించే పనిలో పడ్డారు.
తెలంగాణలో వ్యాక్సినేషన్ పెరుగుతున్నదని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. మరోవైపు, సినిమాలు, హోటళ్లు, రిటైల్ షాపులు తెరిచినా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం కార్యాలయాల మూసివేత వల్ల ఉద్యోగులపై మాత్రమే కాక డ్రైవర్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డులు, కెఫెటేరియా వర్కర్ల జీవితాలపై ప్రభావం పడిందన్నారు. దశల వారీగా ఐటీ కంపెనీలను తెరిచి ఉద్యోగులకు ఆఫీసులకు తరలించేందుకు కొన్ని కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ వసతులు కల్పించగా, ఇంకొన్ని పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని తమ సిబ్బందికి సూచిస్తున్నాయి.