ముంబై, ఫిబ్రవరి 20: తాజా నియామకాల ప్రణాళికను తగ్గించాలన్న యోచన ఇప్పటివరకూ లేదని, అయితే ఐటీ సేవల డిమాండ్కు తగ్గట్టుగా తమ హైరింగ్ ఉంటుందని సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కృతివాసన్ చెప్పారు. కొన్ని కీలక మార్కెట్లలో డిమాండ్ మందగించినందున సాఫ్ట్వేర్ పరిశ్రమ నియామకాల్ని తగ్గిస్తున్నాయని, కొన్ని కంపెనీలు వాటి క్యాంపస్ ఆఫర్ల నుంచి కూడా వెనక్కు వెళుతున్నాయంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో కృతివాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబైలో జరిగిన నాస్కామ్ సదస్సులో టీసీఎస్ చీఫ్ మాట్లాడుతూ ‘ఆర్థిక వ్యవస్థలో గ్రీన్షూట్స్ను మేము ఇప్పటికే చూస్తున్నాం. మరింత పనిచేసేందుకు మరింత మంది ఉద్యోగులు మాకు కావాలి. మేము ఇప్పుడు చేస్తున్నట్టుగానే హైరింగ్ను కొనసాగిస్తాం. బహుశ మేము హైరింగ్ దశను మార్చవచ్చు. కానీ కచ్చితంగా హైరింగ్ ప్రణాళికనైతే తగ్గించేది లేదు’ అని చెప్పారు. 2023-24లో సాఫ్ట్వేర్ పరిశ్రమ కేవలం 60,000 కొత్త ఉద్యోగాలనే జతచేశాయని, దీంతో పరిశ్రమ ఉద్యోగుల సంఖ్య 54.3 లక్షలకు చేరినట్టు గతవారం నాస్కామ్ నివేదిక పేర్కొంది. టీసీఎస్లో 6 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారు. తమ ఉద్యోగులలో 2 లక్షలకుపైగా (35 శాతం) మహిళలు ఉన్నారని కృతివాసన్ తెలిపారు.
వర్క్ ఫ్రం హోంకు ముగింపు పలుకుతాం
ఆఫీసుల్లో కొలీగ్స్, సీనియర్స్ పనిని చూడటం ద్వారా ముఖ్యమైన అంశాలు గ్రహించడం సాధ్యపడుతుందని, ఇంటి నుంచి పనిచేస్తే అటువంటి పాఠాలు నేర్చుకోలేరని టీసీఎస్ చీఫ్ చెప్పారు. ‘వ్యక్తిగతంగా లేదా సంస్థపరంగా ఎదగడానికి వర్క్ ఫ్రం హోం/హైబ్రీడ్ మోడల్ తగిన మార్గం కాదని నేను విశ్వసిస్తున్నా. ఒక సంస్థగా ఒకరికొకరు కలిసి పనిచేయడానికి మేము విలువ ఇస్తాం. జూమ్ కాల్స్ లేదా ఇతర ఆన్లైన్ సాధనం ద్వారా ఇది సాధ్యం కాదని భావిస్తున్నాం’ అంటూ కృతివాసన్ చెప్పుకొచ్చారు. ‘మా ఉద్యోగుల్లో 30-40 శాతం మంది కంపెనీలో చేరినవారే. వారు ఆఫీసుకు రాకపోతే ఈ విలువల్ని, సంస్థాగత సంసృతిని నేర్చుకుంటారు? సీనియర్లు ఎలా పనిచేస్తున్నారన్నది చూసే ముఖ్యమైన పాఠం నేర్చుకోవడం కుదురుతుందన్నారు. అందుచేత వర్క్ ఫ్రం హోంను తాము వద్దనుకుంటున్నామని, తమ కస్టమర్లలో దాదాపు 100 శాతం సంస్థలూ వాటి సిబ్బందిని ఆఫీసుకు రప్పిస్తున్నారని టీసీఎస్ సీఈవో వివరించారు.