న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ రూ. 18,000 కోట్ల బైబ్యాక్ పథకాన్ని బుధవారం ప్రకటించింది. షేరు ఒక్కింటికీ రూ.4,500 ధరతో 4 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలిపింది. అలాగే ఒక్కో షేరు రూ.7 చొప్పున డివిడెండ్ ఇవ్వనున్నట్లు టీసీఎస్ తెలిపింది. డివిడెండ్ చెల్లింపునకు జనవరి 20 రికార్డ్ తేదీగా నిర్ణయించింది.
టీసీఎస్ కీలకమైన ఆదాయ శిఖరాన్ని అధిరోహించింది. 2021 డిసెంబర్తో ముగిసిన ఏడాదికాలంలో కంపెనీ వార్షిక ఆదాయం 25 బిలియన్ డాలర్ల స్థాయిని (రూ.1.85 లక్షల కోట్లు) చేరింది. ఇక ముగిసిన క్యూ3లో టీసీఎస్ నికరలాభం 2020 డిసెంబర్కంటే 12.2 శాతం వృద్ధితో రూ.9,769 కోట్లకు పెరిగింది. 2021 సెప్టెంబర్లో ఆర్జించిన రూ.9,625 కోట్ల లాభంకంటే ఇది 1.5 శాతం అధికం. 2020 డిసెంబర్లో నికరలాభం రూ. 8,701 కోట్లు. తాజా క్యూ3లో కంపెనీ ఆదాయం 16.3 శాతం వృద్ధితో రూ.42,015 కోట్ల నుంచి రూ.48,885 కోట్లకు చేరింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్జించిన రూ. 46,867 కోట్ల కంటే క్యూ3లో ఆదాయం 4.50 శాతం అధికం.
టాలెంట్ను నిలుపుకునేదిశగా టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 1.10 లక్షల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చింది. నాల్గో త్రైమాసికంలో మరో 40,000 మందికి ప్రమోషన్లు ఉంటాయని కంపెనీ సీఎఫ్వో సమీర్ సెక్సారియా తెలిపారు. 2021-22 ప్రథమార్ధంలో 43,000 మంది ఫ్రెషర్స్ను నియమించామని, క్యూ3లో ఇంకో 34,000 నియామకాలు జరిగాయని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 78,000 మంది ఫ్రెషర్లను నియమించాలన్న కంపెనీ లక్ష్యం దీంతో పూర్తయ్యింది. వలసలు పోను డిసెంబర్ క్వార్టర్లో 28,238 ఉద్యోగులు నికరంగా పెరిగారు. డిసెంబర్ 31నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.56,986కు పెరిగింది.
మా నిర్వహణ ప్రక్రియ, సామర్థ్యం, పరిష్కారాలను మా క్లయింట్లు ఎంతో ఇష్టపడతారు. వారి వ్యాపార మార్పులకు తగిన అవసరాల్ని తీరుస్తూ వృద్ధి బాటను
కొనసాగిస్తున్నాం. క్లయింట్ల వినూత్న ప్రయాణాల్ని గుర్తిస్తూ నవతరం ప్రక్రియల్ని ఆవిష్కరిస్తున్నాం’
–రాజేష్ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్