Income Tax | ఆదాయం పన్ను మినహాయింపులు పెంచాలని పన్ను చెల్లింపు దారులు, మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు కోరుతున్నారు. ప్రత్యేకించి ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద మూడింట రెండొంతుల మంది పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు ఫైనాన్సియల్ ప్లానింగ్ స్టార్టప్ కువేరా.. పన్ను మినహాయింపులపై ఇన్వెస్టర్లు, పన్ను చెల్లింపుదారులతో సర్వే నిర్వహించింది. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై ఈ నెల తొలి వారంలో పోల్ నిర్వహించింది. దాదాపు 16 లక్షల మంది యూజర్లు సర్వేలో పాల్గొన్నారు.
ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఇప్పుడు ఉన్న రూ.1.5 లక్షల మినహాయింపును రెట్టింపు చేయాలని కోరుతున్నారని కువేరా కో-ఫౌండర్ గౌరవ్ రస్తోగి తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుత లిమిట్లో ఎటువంటి మార్పులు చేయలేదని ఇన్వెస్టర్లు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనైనా తమకు రిలీఫ్ ఇవ్వాలని పన్ను చెల్లింపు దారులు అంటున్నారు.
కొవిడ్-19, అధిక నిత్యావసర వస్తువుల ధరలు, పెరిగిన వడ్డీరేట్లు, రూపాయిపై డాలర్ మారకం రేటు పెరుగుదల, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితర అంశాలతో ప్రజానీకం ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానంలో మార్పు తేవాలని ప్రతి పది మందిలో ముగ్గురు కోరుతున్నారు. ప్రతి పది మందిలో ఒకరు ద్రవ్యలోటు ఐదు శాతం లోపుకు తీసుకు రావాలని సూచిస్తున్నారు. సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడి వ్యయంలో ప్రాధాన్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.