Maruti Suzuki | పెద్ద కార్లతో పోలిస్తే బుల్లికార్లపై పన్ను భారం తడిసిమోపెడవుతుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్నకార్లు అత్యంత కీలకం అని చెప్పారు. అన్ని క్యాటగిరీల వాహనాలపై ఒకే పన్ను విధించడం ఎంత మాత్రం ప్రయోజకరం కాదని స్పష్టం చేశారు. మాన్యుఫాక్చరింగ్ గ్రోత్ కోసం కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ బాగానే ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో లోపాలు ఆటోమొబైల్ రంగ పరిశ్రమను వెనక్కు నెట్టేస్తున్నాయన్నారు.
చిన్న కార్లపై నియంత్రణ నిబంధనలు ఎక్కువగా ఉండటంతో వాటి ధరలు పెరిగిపోయి, బుల్లి కార్లను కొనేందుకు కస్టమర్లు ముందుకు రావడం లేదని ఆర్సీ భార్గవ చెప్పారు. అలా జరిగితే కార్ల తయారీ రంగానికి, దేశానికి మంచిది కాదని అన్నారు. బుల్లి కార్లలో అభివృద్ధి నమోదు కాకుండా.. పెద్ద కార్ల సేల్స్ పెరుగుతున్నాయని, అన్ని క్యాటగిరీల్లో గ్రోత్ సమాన స్థాయిలో ఉంటేనే ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిలబడుతుందన్నారు.
వెహికల్స్పై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా ఒక శాతం నుంచి 22 శాతం వరకు సెస్ విధిస్తున్నదని ఆర్సీ భార్గవ తెలిపారు. భారత్ కంటే ఎక్కువ తలసరి ఆదాయం గల జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో కూడా వాహనాలపై పన్నులు తక్కువేనని స్పష్టం చేశారు. దాదాపు అన్ని వాహనాలపై 50 శాతం పన్ను వసూళ్లతో ఆ దేశంలో ఆటోమొబైల్ రంగం ఎలా అభివృద్ధి చెందుతుందో తనకైతే అర్థం కావట్లేదని చెప్పారు.