Maruti RC Bhargava | వివిధ వాహనాలపై కేంద్రం విధిస్తున్న పన్నుల వ్యవస్థ మీద ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్లోనే చారిత్రకంగా వాహనాలపై అత్యధిక పన్నులు విధిస్తున్నారని అన్నారు. వివిధ సైజ్ల కార్లపై కూడా వేర్వేరు పన్నులు విధిస్తున్నారన్నారు. వాటిని కనీస స్థాయికి హేతుబద్ధీకరించాలని కోరారు. ప్రపంచ దేశాలతో సమానంగా వాహనాలపై విధిస్తున్న పన్నులను క్రమబద్ధీకరించాలని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో చెప్పారు.
ఈ నెల 18న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు అన్ని రాష్ట్రాల్లో ఒకే నిర్వచనం ఇవ్వాలని నిర్ణయించింది. 1500సీసీకి పైగా సామర్థ్యం గల ఇంజిన్, 4000 మిమీ పొడవు, 170మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ గల అన్ని కార్లకు 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ వర్తిస్తుంది. దీని ప్రకారం మొత్తం పన్నులు 50 శాతానికి చేరుకుంటాయి. 50 శాతం పన్నుల వ్యవస్థతో భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమ పురోగతి సాధించలేదని ఆర్సీ భార్గవ చెప్పారు.
పెద్ద కార్లతో పోలిస్తే బుల్లికార్లపైనే నియంత్రణ నిబంధనలు ఎక్కువ అని ఆర్సీ భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే భారతీయుల నుంచి పెద్ద కార్లకు గిరాకీ పెరిగిందన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ నిలకడగా అభివృద్ధి సాధించాలంటే కార్ల మార్కెట్లో కస్టమర్లు పెరుగాల్సి ఉందన్నారు. భారత్లో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్పై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు.