IT Returns | అయోధ్యలో రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయం నిర్మాణానికి మీరు విరాళం ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే ఆదాయం పన్ను చట్టం -1961లోని సెక్షన్ 80జీ కింద మినహాయింపు క్లయిమ్ కోరవచ్చు. రామాలయం రెనోవేషన్, మరమ్మతు పనుల కోసం మీరు చేసే విరాళంలో 50 శాతంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆధ్యాత్మిక సంస్థలకు వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు దారులు, కంపెనీలు, సంస్థలు ఇచ్చే విరాళాలపై ఆదాయం పన్ను చట్టం-1961లోని 80జీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగని ఏ సంస్థకు విరాళం ఇచ్చినా ఈ సెక్షన్ వర్తించదు. ఏ సంస్థలు, ఏ ట్రస్టులకు విరాళాలు ఇస్తే పన్ను మినహాయింపు లభిస్తుందో ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్ చెబుతుంది.
2020-21లో ఆదాయం పన్ను చట్టం-1961లో చేసిన సవరణ ప్రకారం 80జీ (బీ) (2) సెక్షన్ చేర్చారు. దీని కింద రామ మందిర ట్రస్టుకు ఇచ్చే విరాళాల్లో 50 శాతంపై పన్ను మినహాయింపునకు అనుమతి ఇస్తుంది. ఉదాహరణకు మీరు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు రూ.లక్ష విరాళం ఇచ్చారనుకుందాం.. అందులో రూ.50 వేల వరకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీ ఆదాయం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు డొనేషన్ రశీదు జత చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పొందే స్థూల ఆదాయంలో పది శాతానికి మించి విరాళాలు ఇవ్వకూడదు. అలాగే ఎవరైనా రూ.20 వేలకు మించి నగదు విరాళాలకూ, వస్తువుల విరాళాలకూ ఈ పన్ను మినహాయింపు వర్తించదు.