Tata- iPhone| భారత్లో ఐ-ఫోన్ల ఉత్పత్తి పెంచాలని భావిస్తున్న ఆపిల్ ప్రణాళికలకు అనుగుణంగా టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దేశంలోనే అతిపెద్ద ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ ప్రణాళిక రూపొందిస్తున్నది. తమిళనాడులోని హోసూర్లో ఈ కంపెనీ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే రెండేండ్లలో 20 అసెంబ్లీ లైన్స్ ఏర్పాటు చేయనున్నది. తద్వారా రెండేండ్ల లోపు 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 12 నుంచి 18 నెలల్లో ఐ-ఫోన్ల తయారీ ప్రక్రియ లక్ష్యానికి చేరుకోవాలని టాటా సన్స్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
చైనాలో తన ఐ-ఫోన్ల ఉత్పత్తిని భారత్తోపాటు థాయిలాండ్, మలేషియాలకు విస్తరించాలన్న లక్ష్యంతో ఆపిల్ భావిస్తున్నది. మరోవైపు కర్ణాటకలోని ఐ-ఫోన్ తయారీ యూనిట్ను ‘విస్ట్రన్’ నుంచి టాటా సన్స్ ఇప్పటికే టేకోవర్ చేసింది. భారత్లో తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి టాటా సన్స్తో ఆపిల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు విషయమై ఇటు ఆపిల్, అటు టాటా సన్స్ ప్రతినిధులు స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు.