న్యూఢిల్లీ, నవంబర్ 30: అటు సంస్థాగత ఇన్వెస్టర్లు, ఇటు హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, రిటైలర్లు ఐపీవోలో షేర్లు దక్కించుకునేందుకు పోటీపడిన టాటా టెక్నాలజీస్ లిస్టింగ్ తొలిరోజునే రాకెట్లా దూసుకెళ్లింది. రూ.500 ధరకు ఐపీవోలో టాటా టెక్నాలజీస్ షేర్లను విక్రయించగా, గురువారం అది 140 శాతం ప్రీమియంతో రూ. 1,200 వద్ద లిస్టయ్యి, ఇంట్రాడేలో రూ.1,400 గరిష్ఠస్థాయికి ఎగబాకింది. చివరకు 163 శాతం ప్రీమియంతో రూ. 1,314 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద టాటా టెక్నాలజీస్ మార్కెట్ విలువ రూ. 53,315 కోట్లుగా నమోదయ్యింది.
ఈ టాటా గ్రూప్ కంపెనీ ఐపీవోలో దాదాపు 4.50 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా, వాటికి 70 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయిన సంగతి తెలిసిందే. టాటా టెక్నాలజీస్ ఆటోమొబైల్, ఎయిర్లైన్ కంపెనీలకు డిజిటల్ ఇంజనీరింగ్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ సర్వీసుల్ని అందిస్తుంది. టాటా గ్రూప్ నుంచి 19 ఏండ్ల తర్వాత జారీ అవుతున్న ఇష్యూకావడం తదితర అంశాలతో టాటా టెక్నాలజీస్ ఐపీవో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. 2004లో టాటా గ్రూప్ నుంచి వచ్చిన ఐటీ దిగ్గజం టీసీఎస్ ఐపీవోలో మదుపుచేసినవారికి ఇప్పటికే ఎన్నో రెట్ల లాభాన్ని అందించింది.