న్యూఢిల్లీ, జనవరి 24:టాటా స్టీల్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. గత కొన్ని త్రైమాసికాలుగా నష్టాలతో కాలంవెళ్లదీసిన సంస్థ..గత త్రైమాసికంలో రూ.522.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. యూరప్లో స్టీల్కు డిమాండ్ పడిపోయినప్పటికీ దేశీయంగా అధికంగా ఉండటం వల్లనే లాభాల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,501.95 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.57,354.16 కోట్లుగా నమోదైన ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.55,539.77 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అంతర్జాతీయ దేశాల్లో నిరాశాజనకంగా ఉండటం, ముఖ్యంగా చైనాలో మందకొడి పరిస్థితులు నెలకొనడంతోపాటు రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కమోడిటీ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టాయని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు రూ.77,405 కోట్ల రుణాలు ఉన్నాయి.