TATA Air India | ఎయిరిండియాను అధికారికంగా టాటా సన్స్ గ్రూప్కు కేంద్రం అప్పగించింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అప్పగింత జరిగింది. రూ.18 వేల కోట్ల బిడ్తో ఎయిరిండియాను టాటా సన్స్ టేకోవర్ చేసుకుంది. టాటాసన్స్ గ్రూప్ చేతికి ఎయిరిండియా రావడం ఆనందంగా ఉందని ఆ సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అభిప్రాయ పడ్డారు. అందరితో కలిసి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎయిరిండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి టాటా సన్స్ గొడుగు కింద ఎయిరిండియా కార్యకలాపాలు జరుగనున్నాయి. ఎయిరిండియా టేకోవర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై నుంచి దేశ రాజధాని హస్తినకు వచ్చిన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైనట్లు సమాచారం.
ఎట్టకేలకు దాదాపు 69 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎయిరిండియా తిరిగి టాటాసన్స్ చెంతకు చేరుకున్నది. అయితే సాంకేతిక క్లియరెన్స్లు వచ్చిన తర్వాత టాటా ఆధీనంలోని ఎయిరిండియా బోర్డులోకి కొత్త డైరెక్టర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లను కొనసాగాలని కోరినట్లు సమాచారం.
అయితే, మహారాజాగా పేరొందిన ఎయిరిండియాకు పూర్వ వైభవం తేవడం టాటా ముందు ఉన్న అతిపెద్ద సవాల్. ఆన్టైం పెర్ఫార్మెన్స్ మెరుగుదలపైనే టాటా సన్స్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. విమానం బయలుదేరడానికి 10 నిమిషాల ముందు ఎయిర్క్రాఫ్ట్ తలుపులు మూసుకుంటాయి. విమానంలోకి వచ్చిన ప్రయాణికులకు అతిథులుగా టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్టాటాతో స్పెషల్గా రికార్డ్ చేసిన సందేశాన్ని వినిపిస్తారు.
అంతే కాదు గురువారం నుంచి ఎంపిక చేసిన రూట్లలో పూర్తి భోజన సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఢిల్లీ-ముంబై రూట్, అమెరికా, బ్రిటన్ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులు, గల్ఫ్లోని ముఖ్యమైన రూట్లలో భోజన వసతి అందుబాటులోకి వస్తుంది. ఎయిరిండియాలో తీసుకు రావాల్సిన మార్పులపై టాటా సన్స్ ప్రతినిధులు సందీప్ వర్మ, మఘా సింఘానియా కీలక అంశాల్లో దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది.