న్యూఢిల్లీ, మే 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా తన నష్టాలను తగ్గించుకుంటున్నది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.992 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చినట్లు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.7,585.34 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి. అటు కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.88,627.90 కోట్ల నుంచి రూ.78,439.06 కోట్లకు తగ్గినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. స్టాండ్లోన్ ఆధారంగా చూస్తే సంస్థ రూ.413.35 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆదాయం కూడా రూ.13,480.42 కోట్ల నుంచి రూ.17,338.27 కోట్లకు పెరిగింది. తన అనుబంధ సంస్థయైన బ్రిటన్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) 4.8 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది.అంతర్జాతీయంగా చిప్ల కొరత ఏర్పడటంతో 2021-22లో జేఎల్ఆర్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. అయినప్పటికీ కస్టమర్ల డిమాండ్ ఉండటంతో భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు ఉన్నాయని జేఎల్ఆర్ వర్గాలు వెల్లడించాయి.