Tata Motors | గుజరాత్లోని సనంద్లో గల ఫోర్డ్ ఇండియా ప్లాంట్ను టేకోవర్ చేసేందుకు టాటా మోటార్స్ జరుపుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయని ఆ సంస్థల సన్నిహిత వర్గాల కథనం. గతేడాది సెప్టెంబర్ 9న భారత్ ఆటోమొబైల్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో ఫోర్డ్ కార్ల సంస్థకు ఉన్న రెండు ప్రొడక్షన్ యూనిట్లలో ఒకటి.. అదీ సనంద్లోని యూనిట్ టేకోవర్ చేసుకోవడానికి టాటా మోటార్స్ ముందు వరుసలో నిలిచింది. దీంతోపాటు ఎంజీ మోటార్స్, భవిష్ అగర్వాల్ సారధ్యంలోని ఓలా మోటార్స్ కూడా సనంద్లోని ఫోర్డ్ ప్లాంట్ కోసం పోటీ పడుతున్నాయి.
గుజరాత్ ప్రభుత్వాధికారులతో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా ప్రతినిధులు చర్చలు జరిపారు. సనంద్ ప్లాంట్.. టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్ తయారీకి అనుకూలంగా ఉందని తెలుస్తున్నది. భారత్లో టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా 85 శాతం సొంత ప్లాంట్లలోనే ఉత్పత్తి చేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఐదారు లక్షల కార్లను భారత్లోనే ఉత్పత్తి చేయాలని టాటా మోటార్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. సనంద్ ప్లాంట్ను టాటా మోటార్స్ టేకోవర్ చేస్తే.. ఉత్పత్తి లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ది మూడో స్థానం. అత్యంత పోటీతో కూడిన భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో రెండో స్థానం కోసం హ్యుండాయ్ మోటార్స్ ఇండియాతో తలపడుతోంది. మరోవైపు, భారత్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి, విదేశాలకు విక్రయించాలన్న ఆప్షన్ను కూడా ఫోర్డ్ ఇండియా పరిశీలిస్తున్నది. అయితే, సనంద్ ప్లాంట్ టేకోవర్పై టాటా మోటార్స్ గానీ, ఫోర్డ్ ఇండియా గానీ స్పందించలేదు.