ముంబై, డిసెంబర్ 5: దేశీయ మార్కెట్లోకి టాటా మోటర్స్ సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. న్యూ ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ ప్లస్ మాడళ్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా చిన్న స్థాయి కమర్షియల్, పికప్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ మాడళ్లను విడుదల చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
వీటితోపాటు గతంలో విడుదల చేసిన ఇంట్రా వీ50, ఏస్ డీజిల్ వాహనాల పనితీరును కూడా మెరుగుపరిచింది. ఈ నూతన వాహనాల కోసం దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న డీలర్ల వద్ద ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని కంపెనీ వర్గాలు సూచించాయి. 1700 కిలోల బరువును తీసుకెళ్లే ఈ వాహనం 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్తో రూపొందించింది.