న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : దేశవ్యాప్తంగా ఈవీ కొనుగోలుదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టాటా మోటర్స్ ప్రత్యేకంగా రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద ఈవీలపై రూ.3.30 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చునని తెలిపింది. టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్య్, హారియర్ ఎస్యూవీతోపాటు టియాగో హ్యాచ్బ్యాక్ను తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. వీటిలో కర్వ్య్ ఈవీపై రూ.3.3 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. ఎక్సేంజ్ బోనస్తోపాటు ఇతర డిస్కౌంట్లు కలుపుకొని మొత్తంగా రూ.3 లక్షలకు పైగా ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ కారు రూ.17.49 లక్షల నుంచి రూ.22.24 లక్షల లోపు దిగిరానున్నది. దీంతోపాటు పంచ్పై రూ.1.40 లక్షల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నది. వీటిలో రూ.1.10 లక్షల బోనస్తోపాటు రూ.30 వేల వరకు ఎక్సేంజ్ బోనస్ పొందవచ్చునని తెలిపింది.
ప్రస్తుతం ఈ కారు రూ.9.99 లక్షలు మొదలుకొని రూ.14.44 లక్షల లోపు లభించనున్నది. అలాగే హారియర్ ఈవీపై రూ.1.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. వీటిలో లక్ష రూపాయలు బోనస్ కింద, మరో రూ.50 వేలు ఎక్సేంజ్ బోనస్ కింద లభించనున్నాయి. ప్రస్తుతం హారియర్ రూ.21.49 లక్షల నుంచి రూ.30.23 లక్షల లోపు ధరకు విక్రయిస్తున్నది. టియాగో ఈవీపై రూ.1.2 లక్షల వరకు ఆదాకానున్నది. దీంట్లో లక్ష రూపాయలు బోనస్ కింద, మరో రూ.20 వేలు ఎక్సేంజ్ కింద అందిస్తున్నది. ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షలకు దిగిరానున్నది. నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.