TATA | దోలేరా, మార్చి 13: ఉప్పు నుంచి కంప్యూటర్ వరకు సేవలు అందిస్తున్న టాటా గ్రూపు తాజాగా చిప్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. అస్సాంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన చిప్ తయారీ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చ్యూవల్గా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ… దశలవారీగా టాటా ఎలక్ట్రానిక్స్ 72 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నదని చెప్పారు. రూ.91 వేల కోట్లతో చిప్ తయారీ ప్లాంట్ను, రూ.27 వేల కోట్లతో చిప్ అసెంబ్లి యూనిట్ను సంస్థ నెలకొల్పబోతున్నది. ఇప్పటికే ఆటోమోటివ్, పవర్, ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్, మెడికల్ రంగాల్లో సేవలు అందిస్తున్న సంస్థ..కొత్తగా ఎలక్ట్రానిక్స్ చిప్ల తయారీలోకి కూడా అడుగుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ చిప్ యూనిట్లో 28 నానోమీటర్ల నుంచి 110 నానోమీటర్ల నోడ్స్లను తయారు చేయనున్నట్లు తెలిపారు. హై-టెక్ గాడ్జెట్లైన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఇలాంటి చిప్ల అవసరమవుతాయని, ముఖ్యంగా 3 ఎన్ఎం, 7 ఎన్ఎం, 14 ఎన్ఎం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని..భవిష్యత్తు ముందున్నది..కనీసంగా 50 వేల మందికి ఉపాధి లభించనుండగా..వీరిలో అస్సాంలోనే 20-22 వేల మందికి అవకాశాలు లభించనున్నాయన్నారు.
2026లో తొలి చిప్: వైష్ణవ్
టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లో తొలి చిప్ రెండేండ్ల తర్వాత అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పుడిప్పుడే చిప్ల తయారీ రంగంలో అడుగుపెట్టినట్టు, 2029 నాటికి టాప్-5 ప్రపంచ చిప్ తయారీ దేశాల సరసన చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. టాటా ఎలక్ట్రానిక్స్ ధోలేరా ప్లాంట్ డిసెంబర్ 2026 నాటికి సిద్ధమవనుండగా, మైక్రాన్ ప్లాంట్ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నదన్నారు. ధోలేరా ప్లాంట్లో 28, 50, 55 నానోమీటర్ నోడ్ చిప్లను తయారు చేయనున్నది. తైవాన్కు చెందిన పవర్చిప్ సెమికండక్టర్ తయారీ సంస్థతో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్లాంట్లో రోజుకు 15 మిలియన్ల చిప్లు తయారుకానున్నాయి.