హైదరాబాద్, జనవరి 19: టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏఎల్) మరో ఘనత సాధించింది. ఇండియన్ ఆర్మీ నుంచి పొందిన ఏహెచ్-64 అపాచీ ఆర్డర్లలో భాగంగా తన తొలి ఫ్యూజ్లేజ్(హెలికాప్టర్ బాడీ)ని సరఫరా చేసింది. హైదరాబాద్లోని ఆదిబట్లలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలోనే దీనిని తయారు చేసింది. ఇండియన్ ఆర్మీ నుంచి టీబీఏఎల్ ఆరు ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ ఆర్డర్లు పొందింది. దీంట్లోభాగంగానే తన తొలి ఆర్డర్ను గురువారం భద్రత దళాలకు అందచేసింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా నిబద్ధతకు ఈ ఆర్డర్ నిదర్శణమని, జాయింట్ వెంచర్లో ఏర్పాటైన ఈ యూనిట్లోనే ప్రపంచస్థాయి ఎయిర్స్పేస్ పరికరాలను తయారు చేస్తున్నట్లు బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తా తెలిపారు. 2020లోనే ఇండియన్ ఎయిర్ఫోర్స్కు 22 ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను బోయింగ్ సరఫరా చేసినట్లు చెప్పారు.
‘తొలి ఫ్యూజ్లేజ్ బోయింగ్ ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ను దేశీయ భద్రత దళాలకు విజయవంతంగా అందచేయడం జరిగింది. టీఏబీఎల్ ఉద్యోగులు నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైంది’
– సుకారణ్ సింగ్,టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఎండీ