హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్లోని తమ ఉత్పాదక కేంద్రం నుంచి ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ కోసం మరో ఫ్యూజ్లేజ్ను పంపినట్టు టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తెలిపింది. ఇది ఇక్కడి నుంచి డెలివరీ అయిన 250వ హెలికాప్టర్ బాడీ కావడం గమనార్హం. టీబీఏఎల్ తయారు చేస్తున్న ఫ్యూజ్లేజ్లకు అమెరికా సైన్యంసహా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లున్నారు.
భారత సైన్యం పొందుతున్న అపాచీ హెలికాప్టర్లకూ వీటినే వాడుతున్నారు. కాగా, ఈ ఫ్యూజ్లేజ్లు అమెరికాలోని అరిజోనాలోగల బోయింగ్ మెసా ప్లాంట్కు సరఫరా అవుతున్నాయి. ఇక్కడే బోయింగ్ తయారుచేసే ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్లు తుది రూపును సంతరించుకుంటాయి. ఇంజిన్సహా అన్ని భాగాలను హైదరాబాద్ ప్లాంట్లో టీబీఏఎల్ తయారు చేసిన ఫ్యూజ్లేజ్లో అమర్చుతారు.
బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) కలిసి ఏర్పాటుచేసిన జాయింట్ వెంచరే ఈ టీబీఏఎల్. ఆదిభట్లలో 14వేల చదరపు అడుగుల్లో టీబీఏఎల్ ప్లాంట్ ఉండగా, ఇక్కడ 900లకుపైగా ఇంజినీర్లు, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అధునాతన కటింగ్-ఎడ్జ్ రోబోటిక్స్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ సాంకేతికతలను తయారీలో వినియోగిస్తున్నారు. అందుకే అపాచీ ఫ్యూజ్లేజ్ సరఫరాలో ఈ ప్లాంట్ కీలకంగా మారింది.
నిజానికి అపాచీ ఏరోస్ట్రక్చర్ అసెంబ్లీల్లో వినియోగించే 90 శాతానికిపైగా విడిభాగాలు భారత్లో తయారైనవే అవడం విశేషం. దేశంలోని 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన, ఏమాత్రం గురి తప్పకుండా దాడులు చేసే హెలికాప్టర్లలో ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ కూడా ఒకటి. అందుకే అగ్ర దేశాల నుంచి చిన్న దేశాల వరకు తమ రక్షణ వ్యవస్థలో వీటికి ప్రధాన స్థానాన్ని ఇస్తున్నాయి. ఇందులోని రకరకాల తుపాకులు, క్షిపణులు ఆకాశ, భూ లక్ష్యాలను సమర్థవంతంగా చేధించగలవు.