హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు ఆధునిక సాంకేతికతను జోడించి బీసీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి సూచించారు. ఆ లక్ష్యంతో బీసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (బీఐసీసీఐ లేదా బిక్కీ)ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. బీఐసీసీఐ స్థాపన, లోగో ఆవిష్కరణ వేడుకను బేగంపేటలోని హరితా ప్లాజాలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఐసీసీఐ అధ్యక్షుడు చేరాల నారాయణ అధ్యక్షత వహించగా, నరహరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా నిలిచి పూర్తిస్థాయి సేవలను అందిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేయాలనే లక్ష్యంతో కొందరు యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో సంస్థ పురుడు పోసుకుందని వెల్లడించారు. అందుకు శ్రీకారం చుట్టిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రత్యేకంగా అభినందించారు. తయారీ, వ్యవసాయం, హెల్త్, ఫార్మసీ, ఇంజినీరింగ్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో యువత ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ వెనకబడినవర్గాల వారిలో చైతన్యం కల్పిస్తూ వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ దాసరి, ఆడెపు జగదాంబ, కీర్తి నాగార్జున, పర్స శ్రీనివాస్, ఏపూరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.