హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. మౌలిక వసతుల కల్పన, మానవ వనరులు, సుస్థిరత కారణంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తీసుకొచ్చిన పాలసీలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు, కేటీఆర్ విజన్ వెరసి.. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే మేటిగా విరాజిల్లుతున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘సామాజిక ఆర్థిక సర్వే-2026’ సైతం పదేండ్ల బీఆర్ఎస్ పాలనా ప్రగతిని గణాంకాలతో రుజువు చేసింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీలు అద్భుత ఫలితాలు ఇవ్వడంతో, ఐటీ రంగంలో రాష్ర్టాన్ని లీడర్గా నిలిపినట్టు ఈ సర్వే కితాబు ఇవ్వడం గమనార్హం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)కి హైదరాబాద్ గ్లోబల్ హబ్గా మారిందని, నగరంలో 1,500 ఐటీ, దాని అనుబంధ కంపెనీలున్నట్టు సర్వేలో తేలింది. ఇందులో మల్టీ నేషనల్ కంపెనీలతోపాటు, చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. 2023-24నాటికి రూ.2,68,223 కోట్ల ఐటీ ఎగుమతులు జరుగగా, 2024-25కు ఇవి రూ.3,12,941 కోట్లకు చేరాయి. అయితే 2023-24లో 9,46,285 మంది ఐటీ రంగంలో ఉపాధి పొందగా, 2024-25కి ఈ సంఖ్య 9,39,054కి తగ్గినట్టు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో 7,231 ఉద్యోగాలు తగ్గిపోయాయన్నమాట. కాగా, దేశంలో 1,700 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) ఉన్నట్టు నాస్కమ్, జొన్నొవ్లు విడుదల చేసిన ‘ఇండియా జీసీసీ ల్యాండ్స్కేప్ రిపోర్టు’ వెల్లడించింది. వీటిల్లో 19 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నట్టు వివరించింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, ముంబై-ఎన్సీఆర్లో కీలక జీసీసీలున్నట్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ జీసీసీలకు హబ్గా నిలిచిందని ఈ సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో 20% నగరంలోనే ఉన్నట్టు వెల్లడించింది మరి. ఉన్నతస్థాయి మౌలిక సదుపాయాలు, బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలు, టాలెంట్ పూల్ కారణంగా ఇన్నోవేషన్కు హైదరాబాద్ అడ్డాగా మారిందని సామాజిక ఆర్థిక సర్వే-2026 కొనియాడింది.
ఓవైపు టీ-హబ్, మరోవైపు వీ-హబ్లతోపాటు ఇంకోవైపు యువతలో నైపుణ్యాలు పెంచడంతో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్)’ను ప్రారంభించింది. ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను టాస్క్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చింది. టాస్క్ ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ప్రస్తుతం జీసీసీల్లో సైతం ఉన్నత ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక టాస్క్ అందిస్తున్న సేవలను సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించింది. ఇండస్ట్రీ రెడీ మానవ వనరులను టాస్క్ ద్వారా అందిస్తున్నట్టు వివరించింది. 2025లో 66,333 మంది టాస్క్ ద్వారా శిక్షణ పొందినట్టు సర్వే వెల్లడించింది. టైర్-2, టైర్-3 సిటీల్లో 2,520 మంది శిక్షణ ఇచ్చినట్టు వివరించింది. తద్వారా 5,637 మందికి ప్లేస్మెంట్స్ లభించినట్టు పేర్కొంది. టాస్క్ ద్వారా శిక్షణ పొందిన యువత అత్యధికంగా ఏడాదికి రూ.18 లక్షల వేతనంతో ఉద్యోగం పొందినట్టు వెల్లడించింది. టాస్క్ కేంద్రాల ద్వారా 288 జాబ్ డ్రైవ్లు నిర్వహించినట్టు ఆర్థిక సర్వే తెలిపింది.
బీఆర్ఎస్ హయాంలో 2015లో ప్రవేశపెట్టిన టీ-ఫైబర్ రాష్ట్ర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీకి కీలకమని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొన్నది. రాష్ట్రంలో హై లెవల్ ఇంటర్నేట్ సేవలకు ఇది కీలకమని తెలిపింది. 589 మండలాల్లోని 12,751 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా టీ-ఫైబర్ పనిచేస్తున్నట్టు వివరించింది. టీ-ఫైబర్ వ్యవసాయంతో పాటు విద్యా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు ప్రశంసించింది. 1,370 రైతు వేదికలకు టీ-ఫైబర్ను కనెక్ట్ చేసినట్టు వెల్లడించింది. వ్యవసాయ రంగ నిపుణులతో రైతులకు వీడియోల ద్వారా సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలిపింది. ప్రతి వారం రాష్ట్రంలో 30,000 మంది రైతులు ఈ సేవలు పొందుతున్నట్టు స్పష్టం చేసింది.