‘పట్టుకోవడం గొప్పా.. వదిలేయడం గొప్పా..’ పురాణేతిహాసాల్లోనే కాదు, ఆర్థిక పర్వంలోనూ ఇదో అంతుచిక్కని ధర్మసందేహం. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా.. వదిలేయడమే ఉత్తమ నిర్ణయమవుతుంది. ‘..సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్’ అని పదే పదే హెచ్చరిస్తున్నా పట్టుకునే మ్యూచువల్ ఫండ్స్పై పట్టు సడలించకుండా వాడుకున్న కొద్దీ లబ్ధి చేకూరుతుంది. రాజ్యం వదులుకొని వనవాసానికి వెళ్లిన పాండవులను అక్షయ పాత్ర ఆదుకున్నట్టు.. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఎస్డబ్ల్యూపీ అండగా నిలుస్తుంది. ఈ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్తో మూలధనాన్ని ముచ్చటగా పెంచుకుంటూనే.. ప్రతి నెలా మీ కోటా నుంచి కోరుకున్నంత వాటాను పెన్షన్గా అందుకోవచ్చు.
తింటూకూర్చుంటే కొండలైనా కరిగిపోతాయని పెద్దల మాట. వయసులో ఉన్నప్పుడంటే ఆస్తి జోలికి వెళ్లకుండా కష్టం కొద్దీ బతకొచ్చు కానీ, రెక్కలు ముక్కలయ్యాక పరిస్థితేంటి? ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెలా ఆదాయం పొందుతూ, మూలధనాన్ని పెంచుకునే ఎస్డబ్ల్యూపీ బెస్ట్ ఆప్షన్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు పూర్తిగా రివర్స్లో ఇది పనిచేస్తుంది. లెక్కలు కాస్త చిక్కుగా అనిపించినా, మార్కెట్ కదలికలు మొదట్లో గుబులు పుట్టించినా పక్కా ఆదాయానికి ఎస్డబ్ల్యూపీ ఎంపిక సరైనది.
ఎస్ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడతారు. మార్కెట్ పెరిగితే.. ఆగమేఘాల మీద పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలని ఆరాటపడతారు. మార్కెట్ కుదేలైతే.. పెట్టిన కష్టమంతా వృథా అయిందని బావురుమంటారు. దీర్ఘకాలిక ప్రయాణంలో ఈ తాత్కాలిక భావోద్వేగాలకు లోనుకావొద్దు. మార్కెట్ పెరిగినా, తగ్గినా మ్యూచువల్ ఫండ్స్ కొనసాగించాలి. పదిహేనేండ్లపాటూ ఎస్ఐపీ కొనసాగించిన తర్వాత.. అప్పుడు అందుబాటులో ఉన్న మూలధనం ఆధారంగా ఎస్డబ్ల్యూపీని యాక్టివేట్ చేయాలి. నెలకు ఇంత చొప్పున ఎస్ఐపీ చేసినట్టుగానే.. ప్రతి నెలా ఫిక్స్డ్ శాతం మొత్తం మీ ఖాతాలో పడుతుంది. ఉదాహరణకు మీ మ్యూచువల్ ఫండ్స్లో రూ.25 లక్షలు ఉన్నాయనుకోండి. అందులో ఆరు శాతం ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే.. నెలకు రూ.15వేలు మీ ఖాతాలో జమవుతుంది. ఏడాదికి రూ.1.80 లక్షలు మీకు అందుతాయి. అదే సమయంలో 13 శాతం రిటర్న్ చొప్పున లెక్కేసుకున్నా మీ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం రూ.26 లక్షల వరకు చేరుకుంటుంది. నెలకు రూ.15వేలు అందుకుంటున్నా మూలధనం పెరగడం గొప్ప విషయమే కదా!
నెలవారీగా ఎస్ఐపీ చేయని వారికి ఎస్డబ్ల్యూపీ వర్తించదన్న అనుమానం వద్దు. బ్యాంకులో ఎఫ్డీ చేసినట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో పెద్దమొత్తం ఒకేసారి పెట్టగలిగితే.. ప్రతినెలా ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. కోటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడని అనుకుందాం. ఆరు శాతం ఎస్డబ్యూపీ ఆప్షన్ను ఎంచుకున్నాడు. అతనికి నెలకు రూ.50 వేలు ఆదాయం సమకూరుతుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. ఈ ఏడాదిలో మార్కెట్ గణనీయంగా పడిపోతే.. ఆ ప్రభావం మూలధనంపై పడుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ 20 శాతం వరకు తగ్గొచ్చు. అయినా కంగారుపడాల్సిన పనిలేదు.
ఆ మరుసటి బుల్ గట్టిగా పరిగెత్తితే పరిస్థితి సెట్ అయిపోతుంది. బుల్ రంకెలకు, బేర్ దూకుడుకు వెరవకుండా మ్యూచువల్ ఫండ్స్ కొనసాగించగలిగితే… రూ.కోటి ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి నెలకు ఎస్డబ్ల్యూపీ ద్వారా రూ.50 వేలు (6 శాతం) తీసుకున్నా… పదేండ్లు గడిచేసరికి అతని మూలధనం సుమారు రూ.2 కోట్లకు చేరుతుంది. ఏడాదికి రూ.6 లక్షల చొప్పున పదేండ్లలో ఆ వ్యక్తి రూ.60 లక్షలు తీసుకున్నా.. మూలధనం డబుల్ అవుతుండటం గమనించాల్సిన విషయం. ఎప్పుడైతే మూలధనం రెండు కోట్లకు చేరుకుంటుందో.. అప్పుడు ఎస్డబ్ల్యూపీ ద్వారా నెలకు రూ.లక్ష (6 శాతం) వస్తుంది. మళ్లీ పదేండ్లలో మూలధనం రమారమి రూ.4 కోట్లకు పడగలెత్తుతుంది. నెలకు రూ.లక్ష చొప్పున ఈ పదేండ్లలో రూ.1.20 కోట్లు అందుకున్నామంటే నమ్మబుద్ధి కాదు. రూ.కోటి పెట్టుబడితోనే ఇవన్నీ సాధ్యం.
రూ.కోటి ఇన్వెస్ట్ చేసే స్థాయి లేదనుకుంటే.. రూ.25 లక్షలతో ప్రయత్నించండి. అదీ కాకపోతే రూ.10 లక్షలతో మొదలుపెట్టండి. రిటైర్మెంట్ ఫండ్లోంచి సగం మ్యూచువల్ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి… ఎస్డబ్ల్యూపీ ఎంచుకోండి. రూ.10 లక్షలకు నెలకు రూ.5,000 (పదేండ్లకు రూ.6 లక్షలు) మీ ఖాతాలో జమవుతాయి. పదేండ్లలో మీ పది లక్షలు కాస్త ఇరవై లక్షలు అవుతాయి. ఇవే పది లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారే అనుకోండి. నెలకు గరిష్ఠంగా రూ.6,000 వరకు వస్తుంది. పదిహేనేండ్ల తర్వాత కూడా మీ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తం రూ.10 లక్షలుగానే ఉంటుంది. అందుకే, పట్టుకోవడం కన్నా.. వదిలేయడం కూడా అదృష్టాన్నిస్తుంది. రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా జరగాలంటే ఓ పెద్దమొత్తం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి… దాన్ని కాలానికి వదిలేయండి. ఆ మొత్తం అక్కడున్నంత వరకూ కొంత వాటా వెనక్కి తీసుకుంటూనే.. మూలధనాన్ని కొండంత పెంచుకోవచ్చు.
మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, ఎంత తరిగిందన్న విషయాలను పక్కన పెట్టండి. గడిచిన ఇరవై ఏండ్ల గణాంకాలు పరిశీలిస్తే మ్యూచువల్ ఫండ్స్ సగటు రిటర్న్స్ 13 శాతానికి పైచిలుకే ఉంటుందన్నది. ఈ లెక్కన దాన్ని ముట్టుకోకుంటే.. ఐదేండ్లకోసారి మూలధనం దాదాపు రెట్టింపు అవుతుంది. అదే ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ను ఎంచుకుంటే గరిష్ఠంగా పదేండ్లకు ఒకసారి మూలధనం రెట్టింపు అవుతుంది. ఓ ఏడాది మార్కెట్ ఊహాతీతంగా పడిపోయినా, మరుసటి ఏడాది నిదానంగా పెరిగినా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించేవారు గాబరా పడాల్సిన పనిలేదు.
– ఎం. రాం ప్రసాద్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ram@rpwealth.in www.rpwealth.in