Idly Order | మనదేశంలో ప్రాంతాలు, రాష్ర్టాలను బట్టి అల్పాహారం, వంటకాలు మారుతాయి. ఏ ప్రాంతంలో ఏ రుచులు ఉన్నా.. ఎటువంటి వంటకాలు ఉన్నా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో ఇడ్లసీ చాలా పాపులర్ అల్పాహారం. మంచి టేస్ట్తోపాటు ఆరోగ్యానికి మంచిది కూడా.. అందుకే దక్షిణాది రాష్ర్టాల ప్రజలు ఇడ్లీని అమితంగా ఇష్ట పడుతుంటారు. ఓ వ్యక్తి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో ఈ ఇడ్లీని చాలా ఎక్కువ ఆర్డర్ చేశారు. ఏడాదిలో రూ.6 లక్షల విలువైన ఇడ్లీలకు ఆర్డర్ పెట్టారు. ఈ రోజు (మార్చి 30-గురువారం) ప్రపంచ ఇడ్లీ దినోత్సవం. ఈ సందర్భంగా పాపులర్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ (Swiggy) విడుదల చేసిన వార్షిక రిపోర్ట్లో ఈ సంగతి బయట పడింది.
గతేడాది మార్చి 30 నుంచి ఈ నెల 25 మధ్య ఇడ్లీ ఆర్డర్లపై స్విగ్గీ అధ్యయన నివేదిక వెల్లడించింది. గత 12 నెలల్లో 3.3 కోట్ల పేట్ల ఇడ్లీలు డెలివరీ చేసినట్లు తెలిపింది. ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగర వాసులే ఇడ్లీకి ఆర్డర్ చేశారని, తర్వాతీ స్థానంలో కోల్కతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పుణె, విశాఖ వాసులు ఇడ్లీ కోసం ఎక్కువ ఆర్డర్లు పెట్టారని పేర్కొంది.
ఇక హైదరాబాద్ స్విగ్గీ కస్టమర్ ఏకంగా గత ఏడాది కాలంలో రూ.6 లక్షల విలువైన ఇడ్లీలు ఆర్డర్ చేశాడని స్విగ్గీ తెలిపింది. ఈ కస్టమర్ మొత్తం 8428 ప్లేట్ల ఇడ్లీలు తమ ప్లాట్ఫామ్ నుంచి కొనుగోలు చేశారని పేర్కొంది. హైదరాబాద్ నుంచి మాత్రమే కాక బెంగళూరు, చెన్నై నుంచి కూడా ఈ కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ చేశాడని వివరించింది.
గతేడాది కాలంలో దేశవ్యాప్తంగా పౌరులు 3.3 కోట్ల ఇడ్లీ ప్లేట్లు ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. ఉదయం 8-10 గంటల మధ్య అత్యధికంగా ఇడ్లీ కోసం ఆర్డర్లు వచ్చాయని వివరించింది. రాత్రి భోజన టైంలో కూడా ముంబైకర్లతోపాటు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు, హైదరాబాదీలు ఇడ్లీ ఆర్డర్లు చేశారని తెలిపింది. బెంగళూరులో రవ్వ ఇడ్లీకి ప్రధాన్యం ఇస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెయ్యి, నేతి కారంపొడితో ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది.
ఇక చెన్నై, బెంగళూరుల్లోని అడయార్ ఆనంద భవన్, హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్, చెన్నైలోని సంగీతా వెజ్ రెస్టారెంట హైదరాబాద్లో ఉడిపి ఉపహార్ హోటల్స్ ఇడ్లీలకు పాపులర్ అని తమ సర్వేలో తేలిందని స్విగ్గీ వివరించింది. ఇడ్లీ తర్వాత పాపులర్ టిఫిన్గా మసాలా దోశె నిలిచిందని పేర్కొంది.