న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) తన ఖాతాదారులకు చాలా ఆకర్షణీయంగా మారనున్నది. వారిలో 65 ఏండ్లు దాటిన ఖాతాదారుల ప్రీమియం చెల్లింపుల్లో సగం ఈక్విటీ ఫండ్స్లో పెట్టడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) అనుమతినిచ్చింది. ఎన్పీఎస్ నుంచి నిష్క్రమణకు నిబంధనలను పీఎఫ్ఆర్డీఏ సడలించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు 65 ఏండ్ల వయస్సు గల వారు ఎన్పీఎస్లో చేరేందుకు అర్హులు. కానీ సడలించిన నిబంధనల ప్రకారం దాన్ని 70 ఏండ్లకు పొడిగించింది పీఎఫ్ఆర్డీఏ. దీని ప్రకారం 18-65 ఏండ్లకు బదులు 18-70 ఏండ్ల మధ్య ఎప్పుడైనా ఎన్పీఎస్లో చేరొచ్చు.
ఇండియన్ సిటిజన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లు ఇంతకుముందు 65-70 ఏండ్ల వరకు ఎన్పీఎస్లో చేరడానికి అర్హులు.. తాజా నిబంధనల ప్రకారం 75 ఏండ్ల వయస్సు వరకు భారతీయులు, ఓవర్సీస్ ఇండియా పౌరులు అర్హులు.
వయస్సు నిబంధనలు సడలించడంతో ఎన్పీఎస్లో తమ సబ్స్క్రైబర్లను మూసేసిన వారు కూడా మళ్లీ ఇందులో చేరొచ్చు. 65 ఏండ్లు దాటిన వారి ఎన్పీఎస్ ఖాతా ఉన్న నిధుల్లో 15 శాతం వరకు ఈక్విటీ ఫండ్స్లో ఆటో చాయిస్ కింద పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఉంది. యాక్టివ్ చాయిస్ కింద గరిష్ఠంగా 50 శాతం నిధులు ఈక్విటీల్లో మదుపు చేయొచ్చు.
యాక్టివ్ చాయిస్ లేదా ఆటో చాయిస్ కింద ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లు విభిన్న మదుపు పథకాలు, ఈక్విటీల్లో మదుపు చేసే స్వేచ్ఛ ప్రతి ఎన్పీఎస్ సబ్స్క్రైబర్కూ ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ కింద 65 ఏండ్లు దాటిన ఎన్పీఎస్ సబ్స్క్రైబర్ల మదుపు మొత్తంలో ఐదు శాతం మాత్రమే ఆల్టర్నేటివ్ అసెట్స్ రూపంలో యాక్టివ్ చాయిస్ కింద పెట్టుబడి పెట్టొచ్చు.
సబ్స్క్రైబర్ తన కార్పస్ ఫండ్లో కనీసం 40 శాతం యాన్యుటీ ఫామ్స్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మిగతా మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ కార్పస్ ఫండ్ రూ.5 లక్షల్లోపు, అంతకన్నా తక్కువ ఉంటే మొత్తం కార్ఫస్ ఫండ్ విత్డ్రా చేసుకోవచ్చు.
మూడేండ్ల తర్వాత ఎన్పీఎస్ నుంచి వైదొలిగితే దాన్ని ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అని పిలుస్తారు. ఇందులో 80 శాతం నిధులను యాన్యుటీ బాండ్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. మిగతా మొత్తం నేరుగా విత్ డ్రా చేసుకోవడానికి నిబంధనలు అనుమతినిస్తున్నాయి. అయితే, ఇందులో కార్పస్ ఫండ్ రూ.2.5 లక్షల్లోపు ఉంటే మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు.
సబ్స్క్రైబర్ మరణిస్తే.. యావత్ కార్పస్ నిధిని సభ్యుడి నామినీకి చెల్లిస్తారు. ఇతర ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లు రిటైర్మెంట్ సమయంలో గానీ, 60 ఏండ్లకు దగ్గరలో ఉన్నవారు గానీ, బీమా సంస్థల ఆఫర్లకు అనుగుణంగా యాన్యుటి బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.