న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంతర్జాతీయ మార్కెట్లోనూ సత్తాచాటుతున్నది. ప్రపంచంలో బలమైన బీమా రంగ సంస్థల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100-2024 పేరిట విడుదలైన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ప్రస్తుతం ఎల్ఐసీ బ్రాండ్ విలువ 9.8 బిలియన్ డాలర్లు, ఇండెక్స్ స్కోర్ 88.3తోపాటు ఏఏఏ బ్రాండ్ రేటింగ్ ఇచ్చింది. ఆ తర్వాతి స్థానంలో క్యాథీ లైఫ్ ఇన్సూరెన్స్ నిలిచింది. కంపెనీ బ్రాండ్ విలువ 9 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. అలాగే 1.3 బిలియన్ డాలర్లతో ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ ఆ తర్వాతి స్థానంలో నిలిచిందని బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. మరోవైపు, చైనాకు చెందిన బీమా బ్రాండ్ నోటబ్లీ బ్రాండ్ విలువ 4 శాతం పెరిగి 33.6 బిలియన్ డాలర్లతో ప్రపంచ బీమా రంగంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్నది. ఆ తర్వాతి కూడా చైనా లైఫ్ ఇన్సూరెన్స్ మూడోస్థానంలోను, సీపీఐసీ ఐదో స్థానంలో నిలిచాయని పేర్కొంది. జర్మనీకి చెందిన అలయెంజ్ రెండో స్థానం వరించగా, ఫ్రాన్స్కు చెందిన యాక్సా తిరిగి తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ తొతి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.39 వేల కోట్లకు చేరుకున్నాయి. అలాగే ఎస్బీఐ లైఫ్ రూ.15 వేల కోట్లు రాబట్టగా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.10,970 కోట్లు రాబట్టగలిగింది.
ఎల్ఐసీకి 39 లక్షల జీఎస్టీ నోటీసు
మరోవైపు, ఎల్ఐసీకి రూ.39.39 లక్షల డిమాండ్ నోటీస్ పంపింది జీఎస్టీ కౌన్సిల్. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.19,64,584 జీఎస్టీ డిమాండ్ నోటీసు పంపగా..పెనాల్టీ రూపంలో రూ.19,74, 584 చెల్లించాలని ఆదేశించింది.