న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆఫీసర్స్ అసోసియేషన్ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. యాజమాన్యం విధించిన బలవంతపు నిఘా చర్యలు, కార్యాలయ పద్ధతులకు వ్యతిరేకంగా మార్చి 2న దేశవ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ మెరుపు సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఏఐబీవోసీ) మద్దతు పలికింది.
ఈ పరిణామాలు కార్యాలయ పనితీరులో తీవ్రమైన, ఆందోళనకరమైన మార్పును సూచిస్తున్నదని, అధికారులు బలవంతంగా ఆలస్యంగా రావడం, ఏకపక్షంగా పని ముగింపు ఆంక్షలు, వృత్తిపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే చర్యల వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని అభిప్రాయపడింది. సిబ్బంది నైతికత, మానసిక శ్రేయస్సు, సంస్థాగత పనితీరుపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడే అవకాశాలున్నాయని, దీనిపై యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేకపోవడంతో సమ్మె బాటపట్టినట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
పని గంటల పునరుద్ధరణ, కొన్ని హెచ్ఆర్ నిబంధనలను ఉపసంహరించుకోవడం, పారదర్శక పాలన, తగినంత నియామకాలు చేయకపోవడం, ఏకపక్ష సెలవు నిరాకరణ, జరిమానాలు, ఏకపక్ష విధాన నిర్ణయాలకు ముగింపు పలుకాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.