ముంబై, ఏప్రిల్ 17: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతోపాటు వచ్చే ఏడాది ఆదాయ అంచనాల్లో కోత విధించడంతో ఇన్ఫోసిస్ షేరు కుప్పకూలింది. ఈ షేరు మార్కెట్లను మరింత నష్టాల్లో కురుకునేలా చేసింది. నష్టాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 988.53 పాయింట్లు లేదా 1.63 శాతం తగ్గింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 520.25 పాయింట్లు నష్టపోయి 60 వేల దిగువకు 59,910.75 పాయింట్లకు జారుకున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 121.15 పాయింట్లు కోల్పోయి 17,706.85 వద్ద నిలిచింది.
కుప్పకూలిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ షేరు కుప్పకూలింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతోపాటు ఈ ఏడాది ఆదాయంలో 4-7 శాతంలోపు వృద్ధి నమోదు కానున్నదని అవుట్లుక్లో పేర్కొనడం మదుపరులకు రుచించలేదు. దీంతో ఇంట్రాడేలో 12 శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 9.40 శాతం నష్టంతో రూ.1,258.10 వద్ద ముగిసింది. ఎన్ఎస్సీలోనూ సంస్థ షేరు 9.37 శాతం పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.59,350 కోట్లు కోల్పోయి రూ.5,21,930.34 కోట్లకు జారుకున్నది.
‘ఆర్థిక ఫలితాలు ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ వారం మార్కెట్ ట్రెండ్పైనా కూడా ఈ ప్రభావం కనిపించనున్నది’
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్