ముంబై, మార్చి 11: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉన్నది. గల్ఫ్ సంక్షోభం తీవ్రం కావడంతో మళ్లీ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది. మంగళవారం ఈక్విటీ ఇండెక్స్లు కోలుకున్నప్పటికీ.. ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. బుధవారం ఉదయం నుంచే ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేశారు మరి.
సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలు పెరుగుతూపోయాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ చివరకు 1,342.27 పాయిం ట్లు లేదా 1.72 శాతం క్షీణించి 76,863.71 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,446.72 పాయింట్లు పతనం కావడం గమనార్హం. కాగా, ఈ నష్టంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.5,14,063.20 కోట్లు హరించుకుపోయింది. ఫలితంగా రూ.4,41,90,196. 39 కోట్ల (4.81 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 394.75 పాయింట్లు లేదా 1.63 శాతం దిగజారి 23,866.85 దగ్గర నిలిచింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. చాలా దేశాలకు ఆర్థిక, వ్యాపారాలపరంగా భీకర నష్టాలనే కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ విషయానికొస్తే.. ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతులపై తీవ్ర ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో వంటగ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధనాల రేట్లూ కొండెక్కుతాయన్న అంచనాలున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో చమురు ఆధారిత కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
అలాగే ఎరువుల తయారీ కంపెనీల షేర్లకూ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటున్నారు. ఇక అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలే లక్ష్యంగా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో ఖతార్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ విలువ దాదాపు 100 డాలర్లు పలుకుతున్నది. అంతకుముందైతే 120 డాలర్లను దాటింది. మరోవైపు హొర్ముజ్ జలసంధిలోని తమ భూభాగాన్ని ఇరాన్ మూసివేసింది. దీంతో సముద్రంపై సరుకు రవాణా వ్యయం తడిసి మోపెడవుతున్నది. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తుండగా.. మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ నిపుణులు ప్రస్తుత ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
ఆటో రంగ షేర్లు అత్యధికంగా 3.06 శాతం నష్టపోయాయి. బ్యాంకింగ్ (2.06 శాతం), ఆర్థిక సేవలు (1.99 శాతం), కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (1.89 శాతం) చొప్పున పడిపోయాయి. అలాగే సెన్సెక్స్ 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 1.55 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.61 శాతం దిగజారాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. జపాన్, దక్షిణ కొరియా, చైనా సూచీలకు మదుపరుల కొనుగోలు మద్దతు లభించింది. అయితే హాంకాంగ్ సూచీ మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలోనూ నష్టాల ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్తో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. ఆ దేశ స్టాక్ మార్కెట్లను లాభాల్లో పరుగులు పెట్టించవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి.
ఇదే జరిగితే యూరప్తోపాటు ఇతర ఆసియా దేశాల సూచీలకూ ఉత్సాహం రావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనుకకు తీసుకుంటూనే ఉన్నారు. మంగళవారం రూ.4,672. 64 కోట్లు ఉపసంహరించుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీ వర్గాలు తెలిపాయి. అయితే దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐ) నుంచి మద్దతు లభిస్తున్నది. రూ.6,333.26 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాయి.