ముంబై, జనవరి 18: కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లో జరుగుతున్న బడ్జెట్ ముందస్తు ర్యాలీకి మంగళవారం సడన్ బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లు క్షీణించిన ప్రభావంతో చివరి గంటలో దేశీ స్టాక్ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 554 పాయింట్లు తగ్గి 60,755 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 18,113 పాయింట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్-30 షేర్లలో 23, నిఫ్టీ-50లో 43 షేర్లు నష్టాలకు లోనయ్యాయి. హెవీవెయిట్ షేర్లలో అన్నింటికంటే అధికంగా మారుతి 4 శాతంపైగా పతనమయ్యింది. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీలు 2-4 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, నెస్లే ఇండియాలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ మెటీరియల్స్, టెలికం, ఆటో, రియల్టీ, మెటల్ సూచీలు 2.76 శాతం వరకూ తగ్గాయి. మిడ్క్యాప్ 2.2 శాతం, స్మాల్క్యాప్ 1.9 శాతం చొప్పున క్షీణించాయి.
తగ్గిన రూ.3.78 లక్షల కోట్ల సంపద
తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.3.78 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.3,78,213 కోట్లు తగ్గి, రూ.2,76,24,224 కోట్ల వద్ద నిలిచింది. జనవరి 17న కంపెనీల విలువ రూ.2,80,02,438 కోట్ల రికార్డుస్థాయికి చేరిన మరుసటి రోజునే పతనం జరగడం గమనార్హం.