Stock Markets : అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) గురువారం నష్టాల్లో ముగిశాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. దాంతో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ (BSE) 539 పాయింట్లు నష్టపోయి 76,933 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 116 పాయింట్లు తగ్గి 24,090 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 273 పాయింట్లు పడిపోయి 57,509 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 0.10 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 0.13 శాతం నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం స్వల్ప లాభాలు నమోదు చేశాయి. సిమెంట్ రంగ సూచీ 1.33 శాతం, పీఎస్యూ బ్యాంక్ 0.94 శాతం, మీడియా 0.89 శాతం, మెటల్స్ 0.86 శాతం చొప్పున నష్టపోయాయి. మార్కెట్లో స్వల్పకాలంలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే స్వల్పంగా కోలుకుంది.
గత సెషన్లో 95.40 స్థాయికి పడిపోయిన రూపాయి గురువారం 95.50 సమీపంలో ట్రేడైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు దేశీయ మార్కెట్లకు కొంత మద్దతుగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశీయ డిమాండ్ బలంగా ఉండటంతో కొన్ని మిడ్క్యాప్ విభాగాలు అంతర్జాతీయ పరిణామాల ప్రభావం నుంచి కొంత రక్షణ పొందుతున్నాయని పేర్కొన్నాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జాక్సన్ హోల్ ప్రసంగంపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భవిష్యత్ విధానంపై ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.