Stock Market Close | వరుసగా ఆరో సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 73వేల మార్క్ను దాటగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. సెన్సెక్స్ మంగళవారం ఉదయం నష్టాల్లో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో నష్టాల్లో మొదలయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే ఉదయం సెన్సెక్స్ 72,727.87 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత కోలుకున్నది.
చివరికు వరకు లాభాల్లో కొనసాగింది. ఒక దశలో 72,510.24 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్.. 73,130.69 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 349.24 పాయింట్ల లాభంతో 73,057.40 వద్ద ముగిసింది. నిఫ్టీ కిత్రం సెషన్తో పోలిస్తే 22,099.20 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత పడుతూ లేస్తూ వచ్చిన సూచీలు.. 22,045.85 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసి నిఫ్టీ.. 22,215.60 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి గత రికార్డును బ్రేక్ చేసింది.
చివరకు 74.70 పాయింట్ల లాభంతో 22,196.95 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 1,661 షేర్లు పురోగమించగా.. 1,667 షేర్లు క్షీణించాయి. 65 మాత్రం మారలేదు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ అత్యధికంగా లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, టీసీఎస్ నష్టపోయాయి. సెక్టోరల్లో బ్యాంక్, మీడియా, పవర్, రియాల్టీ 0.8 నుంచి 2శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఆటో, ఐటీ, మెటల్ దాదాపు ఒక శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.