Adani to Cleartrip | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ తాజాగా ఆన్లైన్ ట్రావెల్, హోటల్ బుకింగ్ సంస్థ క్లియర్ ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలను కొనుగోలు చేసింది. శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ సంగతి తెలిసింది. ఇంతకుముందే క్లియర్ ట్రిప్ను టేకోవర్ చేసిన ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్కార్ట్తో నవంబర్లో అదానీ గ్రూప్ ఒప్పందం పూర్తవుతుందని భావిస్తున్నారు. క్లియర్ ట్రిప్లో అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన వాటా వివరాలు అధికారికంగా వెల్లడి కాకున్నా.. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం 20 శాతం వాటాను కొనుగోలు చేయనున్నదని సమాచారం.
ఈ ఏడాది ఏప్రిల్లో క్లియర్ ట్రిప్ను ఫ్లిప్కార్ట్ టేకోవర్ చేసింది. ఆ తర్వాతే క్లియర్ ట్రిప్లో విమాన ప్రయాణ బుకింగ్స్ పది రెట్లు పెరిగాయని సమాచారం. ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ (ఓటీఏ) స్పేస్లో పట్టు సాధించే లక్ష్యంతో క్లియర్ ట్రిప్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తున్నది.
క్లియర్ ట్రిప్లో వాటాల కొనుగోలు అదానీ గ్రూప్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్న సూపర్ యాప్ బిజినెస్కు కీలకం అని భావిస్తున్నారు. సింగిల్ ప్లాట్ఫామ్పై సూపర్ యాప్ ద్వారా బహుముఖ వినియోగదారుల సేవలను అందించనున్నది. ఇప్పటికే రిలయన్స్, టాటా సన్స్ గ్రూప్లు సూపర్ యాప్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాయి.
ఫ్లిప్కార్ట్ టేకోవర్ చేసిన క్లియర్ట్రిప్లో వాటాల కొనుగోలుపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ రియాక్టయ్యారు. ఫ్లిప్కార్ట్తో భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. క్లియర్ట్రిప్లో వాటా కొనుగోలుతో తమ సూపర్ యాప్ జర్నీ ముందుకెళుతుందన్నారు. డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ నుంచి ట్రావెల్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు గౌతం అదానీ పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యానికి ఆ సంస్థ సీఈవో కల్యాణ్కృష్ణమూర్తికి ధన్యవాదాలు. క్లియర్ ట్రిప్లో పెట్టుబడులతో మా సూపర్ యాప్ ప్రయాణం ముందుకు సాగుతుంది. దీంతో వేల ఉద్యోగాలు లభిస్తాయి. జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.