Steel Prices Rises | రూ.5,000 వరకు పెరిగిన టన్ను రేటు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అన్నింటిపైనా ప్రభావం చూపుతున్నది. ముడి సరకు రవాణా సమస్యలతో ఉక్కు ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే టన్ను రేటు రూ.5వేల వరకు పెరిగింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మున్ముందు ధరలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ నుంచి సంకేతాలున్నాయి. ఇవి దేశీయ నిర్మాణ రంగాన్ని అధికంగా ప్రభావితం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 4: రష్యా-ఉక్రెయిన్ల పోరు.. ఇప్పుడు ఉక్కు ధరలను పరుగులు పెట్టిస్తున్నది. యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ రవాణా వ్యవస్థలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా దేశీయ స్టీల్ తయారీ సంస్థలు గతకొద్ది రోజులుగా ధరలను పెంచుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే హాట్-రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్సీ), టీఎంటీ బార్ల ధరలు టన్నుకు రూ.5,000 వరకు పెరిగాయి. దీంతో టన్ను హెచ్ఆర్సీ ధర దాదాపు రూ.66,000, టీఎంటీ బార్ల ధర సుమారు రూ.65,000లను తాకాయని శుక్రవారం వ్యాపారులు తెలియజేశారు. కాగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ధరలు ఇంకా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో రవాణా వ్యవస్థను యుద్ధం ప్రభావితం చేస్తున్నదని, దీంతో ఉత్పాదక వ్యయం పెరుగుతున్నదని పరిశ్రమలు పేర్కొంటున్నాయి. కోకింగ్ కోల్ టన్ను 500 డాలర్లు పలుకుతున్నదని వివరించాయి. కొద్ది వారాల కిందటి ధరలతో పోల్చితే ఇది దాదాపు 20 శాతం ఎక్కువని వెల్లడించాయి. ఉక్కు తయారీలో ప్రధాన ముడి సరకు కోకింగ్ కోల్ అవగా, ఇది 85 శాతం దిగుమతుల ద్వారానే దేశీయ పరిశ్రమలకు అందుతున్నది. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా భారత్కు దిగుమతులు అవుతుండగా, ఆ తర్వాత దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా దేశాల నుంచి వస్తున్నది.
పెరుగుతున్న ఉక్కు ధరలు.. నిర్మాణ, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. హెచ్ఆర్సీ వినియోగం వాహనాలు, గృహోపకరణాల తయారీలో ఎక్కువగా ఉంటుంది. దీంతో కార్లు, మోటర్సైకిళ్లతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషీన్లు, మైక్రోవేవ్ వోవెన్లు తదితర వస్తువుల ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక టీఎంటీ బార్లతోనే బేస్మెంట్ దగ్గర్నుంచి పిల్లర్లు, స్లాబులను నిర్మించేది. ఫలితంగా ఇండ్ల ధరలు అమాంతం పెరిగిపోయే వీలుందని, అమ్మకాలు తగ్గవచ్చని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘రష్యా-ఉక్రెయిన్ దేశాలు రెండూ ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులు చేస్తున్నవే. ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్ కోల్, సహజ వాయువుల వంటి ముడి సరకులనూ ఇవి విదేశాలకు సరఫరా చేస్తున్నాయి. దీంతో సహజంగానే ఈ ఇరు దేశాల సంక్షోభం.. స్టీల్ మార్కెట్ సైప్లె-డిమాండ్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వ్యయమూ పెరుగుతున్నది. అయినప్పటికీ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వినియోగదారులపై పెద్దగా ప్రభావం పడకుండా ప్రయత్నిస్తున్నాం’
-టీవీ నరేంద్రన్, టాటా స్టీల్ ఎండీ, సీఈవో