న్యూఢిల్లీ : స్టార్టప్స్లో ఈ ఏడాది వేతన పెంపు అంతంతమాత్రమేనని దానికి తోడు కొలువుల కోత తప్పదనే అంచనాలు వెల్లడవుతున్నాయి. రాజకీయ భౌగోళిక రిస్క్లతో పాటు, అంతర్జాతీయ లిక్విడిటీ సమస్యలతో నిధుల కొరత వెంటాడటం స్టార్టప్స్కు ప్రతికూలంగా మారాయని భావిస్తున్నారు. ఈ ముప్పుల ముంగిట స్టార్టప్స్ ఈసారి ఉద్యోగులకు భారీ వేతన పెంపు చేపట్టకపోవచ్చని చెబుతున్నారు.
గత ఏడాది బూమ్ తర్వాత ప్రస్తుత ఏడాది పరిస్ధితి భిన్నంగా ఉందని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేతన పెంపు పెద్దగా ఉండకపోవచ్చని స్టార్టప్ల వ్యవస్ధాపకులు భావిస్తున్నారు. మరోవైపు స్టార్టప్లను ఉద్యోగుల వలస, నైపుణ్యాలతో కూడిన టెకీల కొరత వేధిస్తున్నాయి. ఇక వేక్ఫిట్, ఎరుడిటస్ వంటి కంపెనీలు గత ఏడాది కంటే ఈసారి వేతన పెంపు తక్కువగా ఉంటుందని చెబుతుండగా అప్గ్రాడ్, క్యాష్కరో, స్మూర్, గుడ్ గ్లామ్ వంటి సంస్ధలు నైపుణ్యాలను కాపాడుకోవాలంటే ఇంక్రిమెంట్లు అధికంగా ఇవ్వాలని చెబుతున్నాయి.
ఇక గత ఏడాది 10 నుంచి 12 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చిన ఎడ్టెక్ యూనికార్న్ ఎరుడిటస్ ఈ ఏడాది 8-10 శాతానికే వేతన పెంపును పరిమితం చేస్తోంది. నిధుల కొరత వెంటాడుతుండటంతో కొన్ని స్టార్టప్ కంపెనీల్లో కొలువుల కోత తప్పకపోవచ్చని అంచనా. ఇక భవిష్యత్ వృద్ధి అవకాశాలకు అనుగుణంగా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లు తమ ఉద్యోగుల వేతనాలను క్రమబద్ధీకరించవచ్చని డెలాయిట్ ఇండియాకు చెందిన ఆనంద్రూప్ ఘోష్ పేర్కొన్నారు.