Diwali Gifts | గోవింద్ ధోలకియా.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. ప్రతి యేటా దీపావళి సందర్భంగా విలువైన కార్లు.. సొంత ఇండ్లు.. ఇతర బహుమతులు సిబ్బంది మొత్తానికి అందజేస్తుంటారు. ఆయన దాతృత్వానికి.. మానవత్వానికి మారుపేరు.. సూరత్లో వజ్రాలకు సానబెట్టే సంస్థ శ్రీరామ్కృష్ణ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అధినేత.. గోవింద్ ధోలకియా.. ప్రతియేటా దీపావళికి తన సంస్థలో పని చేస్తున్న వెయ్యి మంది సిబ్బందికి విలువైన బహుమతులు అందజేస్తూ వార్తల్లో నిలుస్తారు..
ఈ ఏడాది తన సిబ్బంది ఇండ్లలో విద్యుత్ బిల్లుల భారం లేకుండా చేసేశారు ధోలకియా. ఇప్పుడంతా పర్యావరణ హితం ప్రతి ఒక్కరి తారక మంత్రంగా మారింది.. అందుకే గోవింద్ ధోలకియా తన సిబ్బందికి విద్యుత్ బిల్లుల భారం మోసే పని లేకుండా ఈ ఏడాది దీపావళి గిఫ్ట్గా ‘సోలార్ ప్యానెల్స్’ సరఫరా చేశారు.
తమ యజమాని ప్రతియేటా దీపావళికి విలువైన కానుకలు ఇస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. గతేడాది గ్యాస్ స్టవ్, సిలిండర్ ఇస్తే.. ఈసారి అంతకన్నా మేలైన సోలార్ ప్యానెల్స్ సరఫరా చేశారన్నారు. సోలార్ ప్యానెల్స్తో పర్యావరణాన్ని రక్షించడంతోపాటు విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని అన్నారు. తమ ఉద్యోగులందరికీ ఇండ్లలో విద్యుత్ బిల్లులు ఉండవని చెప్పారు. తమ యజమాని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని సిబ్బంది చెబుతున్నారు.
తమ సంస్థలో పని చేసే సిబ్బందితోపాటు దేశంలోని అమరవీరుల కుటుంబాలకు, అన్సంగ్ హీరో ఇండ్లకూ సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెబుతోంది శ్రీరామకృష్ణ ఎక్స్పోర్ట్స్ కంపెనీ. ఇందుకోసం గత ఆగస్టులో ఎస్ఆర్కే నాలెడ్జ్ ఫౌండేషన్ (ఎస్ఆర్కేకేఎఫ్) ఏర్పాటు చేసింది. అంతే కాదు గోవింద్ ధోలాకియా తన సొంతూరు దుధాలకు పూర్తిగా సోలార్ విద్యుత్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చారు. తమ సిబ్బంది భాగస్వామ్యం లేకుండా తమ కంపెనీ విజయాలు సాధించలేదని ధోలాకియా చెప్పారు.