న్యూఢిల్లీ, జనవరి 8: జీ ఎంటర్టైన్మెంట్తో ప్రతిపాదిత విలీనాన్ని సోనీ ఇండియా రద్దుపర్చుకోవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. ఇరు సంస్థలను విలీనం చేసి 10 బిలియన్ డాలర్ల విలువగల మెగా ఎంటర్టైన్మెంట్ కంపెనీగా రూపొందించాలన్న ప్రతిపాదన నుంచి విరమించుకోవాలని సోనీ యోచిస్తున్నదని, ఈ మేరకు జనవరి 20న టెర్మినేషన్ నోటీసు జారీచేయవచ్చని బ్లూంబర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే విలీన కంపెనీకి జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ పునీత్ గోయింకా సారథ్యం వహించడంపై సోనీ ఆలోచనలు ప్రస్తుతం మారిపోయాయని, ఈ నేపథ్యంలో ఒప్పందం రద్దుకు మొగ్గు చూపుతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విలీన కంపెనీకి సోనీ ఇండియా ఎండీ ఎన్పీ సింగ్ నేతృత్వం వహించాలని తాజాగా సోనీ ప్రతిపాదిస్తుండగా, పునీత్ గోయింకాపై జీ పట్టుపడుతున్నది. కంపెనీ నిధుల్ని మళ్లించారన్న ఆరోపణలతో గోయింకా, జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రలపై సెబీ దర్యాప్తు జరుపుతున్నది.