SUV Car Costly | ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు తడిసిమోపెడవుతున్నాయి. ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నా కాస్త ఆలోచించాల్సిందే. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా ఎస్యూవీ కార్లంటే మోజు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్యూవీలతోపాటు అన్ని కార్లపైనా కాంపన్స్సేట్ సెస్ వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించడం ఆసక్తికర పరిణామం. దీంతో ఎస్యూవీ కార్లు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తున్నది. ఎస్యూవీ కార్లను కొనుగోలు చేస్తున్న వారు దాదాపు 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బయో ఫ్యూయల్పై జీఎస్టీ 18 నుంచి ఐదు శాతానికి తగ్గించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎస్యూవీ కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా కాంపన్సేటరీ సెస్ 22 శాతం వసూలు చేయాలని తీర్మానించింది. 4000 ఎంఎం పొడవు, 1500 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల ఇంజిన్, 170 ఎంఎం అంతకంటేఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ గల కార్లను ఎస్యూవీ- స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ అని నిర్వచించారు.
పెన్సిల్, షార్పనర్ తదితర స్టేషనరీ వస్తువులపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.ఇక ద్రవ బెల్లంపై ఇప్పటి వరకు విధించిన 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించింది. ఒకవేళ ప్రీ-ప్యాకేజ్డ్ అండ్ రెడీమేడ్ అయితే ఐదుశాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,55,922 కోట్లు దాటాయి. గత డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,49,507 కోట్లు నమోదయ్యాయి. ఇక ఇండ్లు, రోడ్లు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన సిమెంట్పై జీఎస్టీ తగ్గింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
వివిధ రకాలుగా రూపేణా వసూలు చేస్తున్నసెస్లో 5 శాతం ఐదేండ్ల బకాయిని చెల్లించడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తున్నది. ట్రాకింగ్ డివైజ్లు లేదా డేటా లాగర్స్పై జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. వార్షిక జీఎస్టీల ఫైలింగ్లో ఆలస్యానికి విధిస్తున్నపెనాల్టీలను క్రమబద్ధీకరించాలని కౌన్సిల్ తీర్మానించింది. గత జూన్ నెల వరకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం బకాయిలు రూ.16,982 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. రాష్ట్రాల పరిహారం చెల్లింపునకు ఎటువంటి గడువు విధించలేదు.