రూ.160 కోట్ల మోసంపై సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ, జూలై 17: టెక్స్టైల్ దిగ్గజం ఎస్ కుమార్స్ నేషన్వైడ్ లిమిటెడ్ (ఎస్కేఎన్ఎల్)పై బ్యాంక్ మోసం కేసును సీబీఐ నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎస్కేఎన్ఎల్ 2013-18 వ్యవధిలో రూ.160.68 కోట్లు మోసం చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు శనివారం తెలిపారు. ఎస్కేఎన్ఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు మోసానికి పాల్పడినట్లు బ్యాంక్ నుంచి ఫిర్యాదు అందిందని, దాంతో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని పేర్కొన్నారు.
సంస్థ ఎండీ నితిన్ కస్లీవాల్, డైరెక్టర్లు విజయ్ గోవర్ధన్దాస్ కలంత్రీ, అనిల్కుమార్ చన్నా, రాజీందర్ క్రిషన్ గార్గ్, జగదీష్ సంజీవరెడ్డి తదితరులు మోసపూరిత లావాదేవీలతో బ్యాంక్ను నష్టపరిచినట్లు కేసు నమోదైంది. కాగా, 2013లోనే ఎస్కేఎన్ఎల్ ఖాతాను మొండి బకాయి (ఎన్పీఏ)గా బ్యాంక్ ప్రకటించింది.
కేపీఎంజీ ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత 2020లో మోసపూరిత ఖాతాగా తేల్చింది. తప్పుడు లావాదేవీలు, వ్యాపార అవకతవకలతో మభ్యపెట్టారని యూనియన్ బ్యాంక్ పేర్కొన్నది. నడువని సంస్థలతో లావాదేవీలను జరిపినట్లు సృష్టించారన్నది. కంపెనీ ఆడిటర్లకూ సదరు సంస్థలో పెట్టుబడులున్నాయని ఆరోపించింది.