సిల్వర్ ఈటీఎఫ్లను మార్కెట్లోకి జారీ చేయడానికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు అనుమతులు ఇస్తూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు దేశంలో ఈక్విటీ ఈటీఎఫ్లు కాకుండా గోల్డ్ ఈటీఎఫ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే సిల్వర్, ప్లాటినమ్, పల్లాడియం వంటి విలువైన లోహాల్లో కూడా మదుపు చేసేందుకు వీలుగా ఈటీఎఫ్లకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నది. వీటి వల్ల పోర్ట్ఫోలియో మరింత డైవర్సిఫికేషన్ చేయడానికి వీలవుతుంది. ముడిచమురు ఈటీఎఫ్లకు కూడా అనుమతివ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఈ క్రమంలోనే గతవారం జరిగిన బోర్డు సమావేశంలో కొత్తగా సిల్వర్ ఈటీఎఫ్లను జారీ చేయడానికి సెబీ అంగీకరించింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ చట్టాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపింది. కొన్నేండ్లుగా బంగారంతోపాటు వెండిలో పెట్టుబడులు భారత్లో సంప్రదాయక పెట్టుబడి సాధనంగా ఉన్నాయి.
ప్రస్తుతం నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ (గోల్డ్ బీస్) వద్ద రూ.6,000 కోట్ల ఏయుఎం ఉన్నది. అలాగే హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్లో రూ.2,682 కోట్లు, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్లో రూ.2,354 కోట్లదాకా పెట్టుబడులున్నాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్లో కలిపి మొత్తం రూ.16,349 కోట్ల పెట్టుబడులున్నాయి. సెబీ నిర్ణయంతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు సిల్వర్ ఈటీఎఫ్లను జారీ చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి.
పెట్టుబడికి అనువేనా?
గోల్డ్ ఈటీఎఫ్లకు వర్తించే నిబంధనలే సిల్వర్ ఈటీఎఫ్లకు వర్తిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్లో మదుపు భౌతిక బంగారానికి ఎలక్ట్రానిక్ రూపంగా ఉంటుంది. 90 శాతం నిధులను బంగారంలోనే మ్యూచువల్ ఫండ్ మదుపు చేస్తుంది. మిగిలినది ఇతర ఫిక్స్డ్ ఆదాయ వనరులపై మదుపు చేసే ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుంది. ఇదే నిబంధన సిల్వర్ ఈటీఎఫ్లకు కూడా వర్తిస్తుంది. ఈటీఎఫ్లు ఎక్సేంజీలలో ట్రేడ్ అవుతాయి. మార్కెట్ పనివేళల్లో ఏ రోజైనా కొని, అమ్ముకునేందుకు వీలుండడం వల్ల వీటికి లిక్విడిటీ ఎక్కువ. అయితే బంగారంతో పోల్చితే సిల్వర్లో ఒడిదుడుకులు కాస్త ఎక్కువే. ఇటీవల బంగారం ధరల్లో ఒడిదుడుకులున్నప్పటికీ ఈటీఎఫ్లు గత ఏడాది కాలంలో లాభాలనే పంచాయి. అమెరికాలో సిల్వర్ ఈటీఎఫ్లలో 13.7 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి.
అక్కడ రెండు రకాలుగా నిర్వహణ సంస్థలు మదుపు చేస్తాయి. మొదటిది ఫిజికల్గా వెండిలో మదుపు చేయడం. దీనివల్ల ధర పెరిగేకొద్దీ ఇన్వెస్టర్కు లాభాలు వస్తాయి. రెండోది డెరివేటివ్స్లో ట్రేడింగ్తో రాబడిని ఇవ్వడం. కొన్ని ఫండ్లు ఈ రెండు పద్ధతులను పాటించి రాబడిని అందిస్తాయి. మన దేశంలో మాత్రం ఫిజికల్గా మ్యూచువల్ ఫండ్లు సిల్వర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సిల్వర్ కేవలం ఆభరణాలు, అలంకరణ సామగ్రిల కోసమే కాకుండా పారిశ్రామిక అవసరాలకూ ఉపయోగపడుతున్నది. సమీప భవిష్యత్తులో సిల్వర్కు డిమాండ్ పెరగనున్నందున బంగారం కన్నా ఎక్కువ రాబడిని పొందే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా. మొత్తానికి మదుపరులకు తమ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేయడానికి మరో అవకాశం అతి త్వరలోనే రానున్నది.