హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేందుకు గూగుల్ ముందుకొచ్చింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ)తో కలిసి తక్కువ వడ్డీకే రూ.110 కోట్ల రుణాలు అందించనున్నది. ఈ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. రూ.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన పరిశ్రమల కోసం రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు అందించనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతనిస్తారు. కాగా, ఆర్థికాభివృద్ధిలో కీలకంగా ఉన్న ఎంఎస్ఎంఈలు కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయని, వాటిని ఆదుకునే లక్ష్యంతో ఇప్పటికే తాము పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు సిడ్బీ సీఎండీ శివ సుబ్రహ్మణియన్ రామన్ తెలిపారు. తాజాగా గూగుల్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు.
డిజిటల్ చెల్లింపులను మరింత చేరువ చేసేలా గూగుల్ పే సరికొత్త ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నది. ఎవరికైనా చెల్లింపులు జరుపడానికి వారి మొబైల్ నంబర్లను గూగుల్ పే యాప్లోకి యాడ్ చేసుకునేందుకు ‘స్పీచ్ టు టెక్స్ ఫీచర్’గా వాయిస్ అసిస్టెంట్ సౌకర్యాన్ని పరిచయం చేస్తున్నట్లు గురువారం సంస్థ తెలిపింది. మాట్లాడితేచాలు సదరు నంబర్ యాప్లో ఎంటరైపోతుంది. ఇక హిందీ, ఇంగ్లీష్ కలయికలో హింగ్లీష్ భాషనూ ఎంచుకునే వెసులుబాటును కస్టమర్లకు కల్పిస్తున్నది.