హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని బలోపేతం చేయడంలో స్మాల్ ఇండస్ట్రిస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) కీలక పాత్ర పోషిస్తున్నదని సిడ్బీ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. యూకే సిన్హా సిఫారసులకు అనుగుణంగా సిడ్బీ తెలంగాణ సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రాజక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయు)లను ఏర్పాటు చేస్తున్నదని ఆయన చెప్పారు.
ఎంఎస్ఎంఈ ఎకోసిస్టం అభివృద్ధిపై గురువారం హైదరాబాద్లో ఎఫ్టీసీసీఐ నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 20 రాష్ర్టాల్లో పీఎంయూల ఏర్పాటు పూర్తయిందని, ఇవి పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి నిధుల మంజూరీకి తోడ్పాటును అందిస్తాయన్నారు.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా రాయితీలు, ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్ ఏర్పాటు, రాష్ట్రస్థాయి క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ విడుదలకు సహకారం అందిస్తాయని వివరించారు. పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.