Online Shopping | న్యూఢిల్లీ, మార్చి 1: ఒకప్పుడు షాపింగ్ అంటే ఉత్సాహం.. అంతకుమించిన సందడి. అయితే ఇప్పుడెక్కడా ఈ పరిస్థితులు లేవు. కారణం.. తీరికలేని యాంత్రిక జీవనం, ట్రాఫిక్ తదితర సమస్యలే. అందుకే సంప్రదాయ కొనుగోళ్లను పక్కనబెట్టి ఆన్లైన్ షాపింగ్కు తెరతీశారంతా. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ మార్కెట్ అంతకంతకూ వ్యాపిస్తున్నది. ఇందుకు తగ్గట్టే ఓ తాజా సర్వే ఫలితం కూడా రావడం గమనార్హం. మొబైల్ యాప్స్ ద్వారానే షాపింగ్ను చేసేందుకు దేశంలో 60 శాతానికిపైగా వినియోగదారులు ఇష్టపడుతున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ఒకటి చెప్తున్నది. సులువుగా, ఎటువంటి భారం, ఇబ్బందుల్లేకుండా షాపింగ్ పూర్తవుతుండటమే ఇందుకు కారణమని ‘ఆన్లైన్లో భారతీయ దుకాణాలు ఎలా?: మహానగరాలు, 1-4 శ్రేణి పట్టణాల్లోని వినియోగదారుల ప్రాధాన్యం’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొన్నది.
డిస్కౌంట్లతో..
ఆన్లైన్ షాపింగ్కు ఎక్కువమంది మొగ్గు చూపడానికి కారణాల్లో కొనుగోలుదారుల సౌకర్యానికితోడు పెద్ద ఎత్తున లభిస్తున్న డిస్కౌంట్లు కూడా ఉన్నాయని పీడబ్ల్యూసీ ఇండియా చెప్తున్నది. అంతేగాక రోడ్ల మీదున్న దుకాణాల్లో పరిమిత ఉత్పత్తులు, తక్కువ వెరైటీలుంటున్నాయని.. అదే ఆన్లైన్లో అపరిమిత స్థాయిలో ప్రోడక్ట్స్, ఎన్నో రకాలుంటున్నాయని వివరించింది. ఇకపోతే గత కొన్నేండ్లుగా సాగుతున్న దేశీయ ఆన్లైన్ షాపింగ్ తీరుతెన్నులను పరిశీలిస్తే.. ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లో వినియోగదారులు పెరుగుతున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా రకరకాల మార్గాల్లో, విభిన్న వర్గాలకు చెందిన 2,100 మంది అభిప్రాయాలను ఈ సర్వేలో పీడబ్ల్యూసీ తీసుకున్నది. ఇదిలావుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనల్ని చూసి కొంటున్నవారూ భారీగానే ఉంటున్నారని సర్వే తేల్చింది. అయితే ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ను ఎంచుకుంటున్నట్టు బయటపడింది.