హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): నగరంలోని షాపింగ్ మాల్స్ శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఆఫర్స్తో అదరగొడుతున్నాయి. విభిన్న రకాల చీరలు కేజీల లెక్కన అమ్ముతూ అతివలను ఆకర్షిస్తున్నారు. నాణ్యమైన చీరలను రూ.99 నుంచి రూ.120 ప్రారంభ ధరగా ఆఫర్స్ అందిస్తుండగా కొన్ని షాపింగ్ మాల్స్లో కేజీల చొప్పున విక్రయాలతో క్రేజ్ను పెంచుతున్నారు. వివిధ షాపింగ్ సెంటర్లలో 50 నుంచి 70 శాతం శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ అందిస్తుండగా మరికొన్ని షాపింగ్ మాల్స్లో పెండ్లి పట్టుచీరలపై 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు.
కేజీ చీరలు కొన్ని షాప్స్లో రూ.150 నుంచి.. మరికొన్ని షాపుల్లో రూ.100 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 15 వరకు కొనసాగే అవకాశాలున్నా ఫ్రెష్ స్టాక్స్లో తాజా చీరలను సొంతం చేసుకునేందుకు మహిళలు షాపింగ్ మాల్స్కు క్యూ కడుతున్నారు. మరికొన్ని షాపింగ్ మాల్స్ 2 ప్లస్ 1, 1 ప్ల్లస్ 1 ఆఫర్లతోపాటు రూ.555లకు మూడు, రూ.999కు 10 ఆకర్షణీయమైన ఫ్యాన్సీ చీరలు అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచే షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో ప్రత్యేకించి మహిళామణులతో కిక్కిరిసిపోతున్నాయి.