Shaktikanta Das | క్రిప్టో కరెన్సీపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించాలన్న తన అభిప్రాయాన్ని మరోసారి ఆయన సమర్ధించుకున్నారు. క్రిప్టో కరెన్సీని ఆర్బీఐ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నది. ఈ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా డిజిటల్ రూపీని ఇటీవలనే ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
క్రిప్టో కరెన్సీపై గతంలో వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి తన ఆగ్రహాన్ని వెలివుచ్చారు. క్రిప్టోలకు సరైన విలువ లేదని, ఆర్థిక స్థిరత్వానికి ఇవి ప్రమాదకరమన్నారు. భవిష్యత్ ఆర్థిక సంక్షోభం వస్తే గిస్తే అది ముమ్మాటికీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలతోనే అని ఆయన కుండ బద్దలు కొట్టారు. బిజినెస్ స్టాండర్డ్ బీఎఫ్ఎస్ఐ ఇన్సైట్ సమ్మిట్ శక్తికాంత్ దాస్ ప్రసంగిస్తూ.. మన దేశంలో అంతర్లీన ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా కొనసాగుతున్నాయని, అయితే బాహ్య కారకాలు ఆర్థిక వ్యవస్థకు కొంత నష్టం కలిగిస్తాయని ఆయన చెప్పారు.
ఈ ఏడాది క్రిప్టో కరెన్సీ విలువ 40 బిలియన్ డాలర్లు తగ్గిందని శక్తికాంత్ దాస్ తెలిపారు. క్రిప్టో కరెన్సీ విలువ ఇప్పుడు 140 బిలియన్ డాలర్లుగా ఉన్నదని చెప్పారు. క్రిప్టోలపై ఇంకా నమ్మదగిన వాదన ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. రిటైల్ ఈ-రూపాయి (సీబీడీసీ) ని భవిష్యత్ కరెన్సీగా అభివర్ణించారు. సీబీడీసీలో దేశాల మధ్య తక్షణ నగదు బదిలీ జరుగుతుందని తెలిపారు. ఇది ఈ శతాబ్దంలో డిజిటల్ కరెన్సీలో మన దేశాన్ని ముందంజలో ఉంచుతుందని అన్నారు.