హైదరాబాద్, నవంబర్ 1: కమర్షియల్, ఇండస్ట్రీయల్, రెసిడెన్షియల్ తలుపులు తయారు చేస్తున్న శక్తి హార్మాన్..తాజాగా రిటైల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. రిటైలర్లను ఆకట్టుకోవడానికి హైదరాబాద్తోపాటు ఢిల్లీల్లో తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. కస్టమర్లు టచ్ అండ్ ఫీల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ సెంటర్లను ప్రారంభించినట్టు, కమర్షియల్తోపాటు రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్టు కంపెనీ ఎండీ శశిదర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని గాగిలాపూర్ వద్ద ఉన్న ప్లాంట్లో ప్రతియేటా 2 లక్షల డోర్లు, డోర్ ఫ్రేమ్లు, 10 వేల ఇండస్ట్రీయల్ డోర్ ఫ్రేమ్లు తయారవుతున్నాయి. ప్రస్తుతం 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జైపూర్లో రూ.175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న 1.30 లక్షల యూనిట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. గడిచిన సంవత్సరంలో రూ.270 కోట్లుగా నమోదైన టర్నోవర్, ఈ ఏడాది రూ.320 కోట్లకు చేరుకుంటుందన్నారు.