న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ఆక్సిజన్ కొరత వెంటాడటంతో దేశానికి బాసటగా నిలిచేందుకు చమురు సహజ వాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ముందుకొచ్చింది. గ్లోబల్ సప్లయి చైన్, లాజిస్టిక్స్ లో తన సామర్ధ్యాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం తరపున లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమీకరించాలని ఓఎన్జీసీ నిర్ణయించింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఓఎన్జీసీ నిర్ణయంతో దేశాన్ని వెంటాడుతున్న మెడికల్ ఆక్సిజన్ కొరతను కొంతమేర అధిగమించవచ్చు.
తక్షణ సరఫరాల కోసం ఓఎన్జీసీ ఇప్పటికే 34,673 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం విదేశీ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చింది. వీటిలో 2900 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఈనెల 21కి భారత్ కు చేరుకుంటాయని ఓఎన్జీసీ ట్వీట్ చేసింది. ఇక 40,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దేశీ తయారీదారుల నుంచి సమీకరించనుంది. మరోవైపు మూడు రాష్ట్రాల్లోని పది ప్రభుత్వ దవాఖానల్లో ఓఎన్జీసీ సహకారంతో మూడు ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నారు.