ముంబై, ఫిబ్రవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. రిజర్వు బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచడంతో పాటు ఐటీ, ఆర్థిక, చమురు రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 377.75 పాయింట్లు ఎగబాకి 60,663.79 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 150.20 పాయింట్లు అందుకొని 17,871.70 వద్ద స్థిరపడింది. గత పదిహేను రోజులుగా భారీగా పతనమైన గౌతమ్ అదానీకి చెందిన సంస్థల షేర్లు తిరిగి కోలుకోవడం కూడా మార్కెట్లు బలపడటానికి దోహదం చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, టైటాన్, మారుతితోపాటు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభాల్లో ముగిశాయి. కానీ, ఎల్అండ్టీ, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, హెచ్యూఎల్లు మాత్రం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే కమోడిటీ 2.28 శాతం లాభపడగా..ఐటీ 1.51 శాతం, హెల్త్కేర్ 1.2 శాతం, మెటల్, టెక్నాలజీ రంగ షేర్లు అధికమయ్యాయి.