ముంబై: కరోనా మహమ్మారి స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇప్పటికే గత మూడు సెషన్ల నుంచి నష్టాలు చవిచూస్తున్న స్టాక్మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లోనూ నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న కరోనా కేసులతో పాటు, అమెరికన్ ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిన్నది.
దాంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఇవాళ్టి ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 980 పాయింట్లు నష్టపోయి 59,845కి పడిపోయింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 320 పాయింట్లు కోల్పోయి 17,806కి పతనమైంది. ఇవాళ దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ లో కేవలం టైటాన్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలిచింది. మిగిలిన కంపెనీల షేర్లు అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. టాటా స్టీల్ (4.97), టాటా మోటార్స్ (4.07), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.27), బజాజ్ ఫిన్ సర్వ్ (3.07), రిలయన్స్ (2.96) నష్టాలు మూటగట్టుకున్నాయి.