ముంబై, ఆగస్టు 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మరింత నష్టపోయాయి. ఇంట్రాడేలో భారీగా లాభపడిన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపర్లను అమ్మకాలు వైపు నడిపించాయి. ఫలితంగా చివరి గంటలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూచీలను కిందికు దించాయి. ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 183.15 పాయింట్లు కోల్పోయి 77,472.94 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ సైతం 126.80 పాయింట్లు పతనం చెంది 24,207.75 వద్ద స్థిరపడింది.
30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, లార్సెన్ అండ్ టుబ్రో, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయని, ఐటీ, ఎఫ్ఎంసీజీ, వాహన, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని జియోజిట్ ఫైనాన్షియల్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ 3 శాతం తగ్గి 85.96 డాలర్లకు పడిపోయినప్పటికీ సూచీలు నష్టపోవడం విశేషం. రంగాలవారీగా టెలికాం సూచీ 1.35 శాతం పతనం చెందగా, ఐటీ 1.05 శాతం, ఫోకస్డ్ ఐటీ, యుటిలిటీస్, పవర్, రియల్టీ రంగ సూచీలు నష్టపోయాయి. కానీ, మెటల్, కమోడిటీస్, బ్యాంకింగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి.