న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇటీవల రికార్డులతో రెపరెపలాడిన స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండోరోజూ తగ్గాయి. బుధవారం 400 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 29 పాయింట్లు క్షీణించి 58,250 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9 పాయింట్ల తగ్గుదలతో 17,353 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా నెస్లే ఇండియా 2.44 శాతం క్షీణించింది. మారుతి సుజుకి 1.3 శాతం తగ్గింది. సెమికండక్టర్ల కొరతతో ఆగస్టు నెలలో తమ ఉత్పత్తి 8 శాతం మేర తగ్గిందంటూ మారుతి ప్రకటించడంతో ఈ షేరులో అమ్మకాలు జరిగాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రాలు సైతం నష్టాలతో ముగిసాయి. మరోవైపు కొటక్ మహింద్రా 2.9 శాతం లాభంతో ముగిసింది. టైటాన్, ఎన్టీపీసీ, సన్ఫార్మా, యాక్సిస్బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐలు కూడా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ టెక్, ఐటీ, టెలికాం, ఆటో, మెటల్, ఇండెక్స్లు నష్టపోయాయి. పవర్, కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకెక్స్, యుటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు పెరిగాయి.