న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఇటీవల అదానీ ఎంటర్పైజెస్ రద్దుచేసిన 2.5 బిలియన్ డాలర్ల (రూ.20,000 కోట్లు) ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)లో పాల్గొన్న కొంతమంది ఇన్వెస్టర్లతో అదానీ గ్రూప్నకు ఉన్న సంబంధాలపై మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేస్తున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఆఫర్ విక్రయ ప్రక్రియలో సెక్యూరిటీల చట్ట ఉల్లంఘన జరిగిందా అనే అంశమై సెబీ విచారణ చేస్తున్నదని ఆ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా ఎఫ్పీవోలో యాంకర్ ఇన్వెస్టర్లుగా పెట్టుబడి చేసిన రెండు మారిషస్ సంస్థలు ‘గ్రేట్ ఇంటర్నేషనల్ టస్కర్ ఫండ్, ఆయుష్మాట్’, అదానీ గ్రూప్ల మధ్య ఉన్న లింకులపై సెబీ దృష్టిపెట్టిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని వర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం కంపెనీ వ్యవస్థాపకుడు లేదా వ్యవస్థాపక గ్రూప్తో సంబంధం ఉన్న సంస్థలు యాంకర్ విభాగంలో పెట్టుబడి చేయకూడదు. అలాగే ఎఫ్పీవోకు మేనేజర్లుగా వ్యవహరించిన 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో రెండు సంస్థలు ఎలారా క్యాపిటల్, మోనార్క్ నెట్వర్త్ క్యాపిటల్లు సైతం సెబీ స్కానర్లో ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రధాని నరేంద్ర మోది కార్యాలయంలో అధికారులకు అదానీ ఉదంతంపై జరుగుతున్న దర్యాప్తులను నివేదించిందని, మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో టచ్లో ఉందని ఒక అధికారి తెలిపారు. అదానీ గత సంవత్సరాల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను ఫిబ్రవరి 2 నుంచి కార్పొరేట్ వ్యవహారాల శాఖ సమీక్షిస్తున్నదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.